'రాజకీయాల్లో ఎవరైనా మాజీ కావాల్సిందే', అక్టోబర్ 10 వరకు తెలంగాణ అసెంబ్లీ
హైదరాబాద్: రాజకీయాల్లో ఎవరైనా మాజీ కాక తప్పదని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేల వేతనాలు, మాజీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల వేతనాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కర్ణాటక తరహాలో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్లు పాల్గొన్నారు.

అక్టోబర్ 10 వరకు తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్ 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2, 3, 4న అసెంబ్లీకి సెలవు. ఈరోజు ఉదయం బీఏసీలో నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జరుగుతాయి. అవసరమైతే సమావేశాలను పొడిగింపునకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది.
ఇందుకు స్పీకర్ అంగీకరించారు. 29న రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల అనంతరమే వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని నిర్ణయించారు. సమావేశానికి సీఎం కేసీఆర్, విపక్షనేత జానారెడ్డితో సహా వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు.
రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతికి ఉభయసభలు నివాళి అర్పించాయి. అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications