లంచం అడిగిన వైద్యుడిని.. అక్కడికక్కడే సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై చర్యలుంటాయన్నారు. సోమవారం కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సస్పెన్షన్ వేటు వేశారు.
కొండాపూర్ ఏరియా ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని ఆస్పత్రి వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు.ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.... తక్షణం వైద్యుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు హరీశ్ రావు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి సేవలు అందుతున్న తీరును రోగులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్లు నిర్వహించాలన్నారు మంత్రి హరీశ్ రావు.
అవసరమైన ఆల్ట్రా సౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీశ్ రావు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది తమవంతుగా మరింత కృషి చేయాలన్నారు.