నంది అవార్డులపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన
హైదరాబాద్: సినీ నటులకు అందించే నంది అవార్డులపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2024 ఉగాది నుంచి నంది అవార్డులను అధికారికంగా ఇచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని, ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో ఇప్పటికే చర్చించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.
ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఓ హోటల్లో వీబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్కు 'నటసింహ చక్రవర్తి' బిరుదును ప్రధానం చేసి సత్కరించారు మంత్రి కోమటిరెడ్డి.

ఈ సందర్భంగా మురళీమొహన్.. చిత్ర పరిశ్రమ తరపున నంది పురస్కారాలపై మంత్రి కోమటిరెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సత్కారం కోసం సినీ పరిశ్రమ ఎదురుచూస్తోందని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుల ప్రస్తావనే లేకుండా పోయిందని గుర్తు చేశారు. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రదానం చేసి గౌరవించాలని కోరారు.
ఈ క్రమంలో మురళీమోహన్ అభ్యర్థనపై స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలోనే సినీ పెద్దలను సీఎం రేవంత్ వద్దకు ఆహ్వానించి అవార్డుల విషయంపై చర్చిస్తామని తెలిపారు. కాగా, నంది అవార్డులను గత కొంత కాలంగా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ఇప్పటికే పలువురు సినీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications