టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం... 20 వసంతాలు పూర్తి... పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు...
నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తవుతోంది. ఈ రెండు దశాబ్దాల పార్టీ ప్రయాణాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధిష్ఠానం,శ్రేణులు భావించాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆ ఆలోచనను పార్టీ అధిష్ఠానం విరమించుకుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని వేడుకలను రద్దు చేసింది.అదే సమయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను మాత్రం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు.
పార్టీ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో,ప్రతీ మండలంలో తెలంగాణ సాధించిన ఆత్మగౌరవాన్ని చాటేలా గులాబీ జెండాను ఎగరేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి... తెలంగాణను అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ప్రతీ ఇంటిపై ఎగరవేద్దామన్నారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరపలేకపోతున్నామని చెప్పారు.
సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించి ఉండేవారు. కరోనా కారణంగా ఆ వేడుకలకు బ్రేక్ పడినట్లయింది.కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను వాయిదా వేయడమే సరైనదని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. త్వరలోనే వరంగల్,ఖమ్మం కార్పోరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది.
కాగా,హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న జలదృశ్యంలో 14 ఏళ్ల క్రితం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న సంగతి తెలిసిందే. 2001,ఏప్రిల్ 27న ఆ పార్టీ ఆవిర్భవించింది.నాటి కార్యక్రమంలో పాల్గొన్నవారిలో అత్యధికులు 1969 నాటి ఉద్యమకారులు,విద్యావంతులు, మేధావులే. పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఎక్కడా హింసకు తావు లేకుండా గాంధేయ మార్గంలో ఉద్యమ పంథాను నిర్దేశించారు. ఎన్నో ఒడిదుడుకులు,ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ... దాదాపు 13 ఏళ్ల ప్రస్థానం తర్వాత ఎట్టకేలకు స్వరాష్ట్ర కాంక్షను టీఆర్ఎస్ నిజం చేయగలిగింది.ఆ తర్వాత ఉద్యమ సారథి కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం... 2018లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం తెలిసిందే.
రేపు మంగళవారం (ఏప్రిల్ - 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని... pic.twitter.com/Zd5XmK6qHX
— TRS Party (@trspartyonline) April 26, 2021