ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు?
పెట్రోలు, డీజిల్ పై పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో మోడీ లెక్కచెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రూ.3వే పింఛను ఇస్తామన్నారు.. అమిత్ షాను తీసుకొచ్చి నిధుల వరద పారిస్తామన్నారు.. ఈరోజు ఏమైంది? ఆ మాటలన్నీ ఏమయ్యాయి? 14 నెలల్లో హుజూరాబాద్ లో ఏం అభివృద్ధి జరిగిందని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తమ పార్టీ పేరు ఒక్కటే మారిందని, డీఎన్ఏ, పార్టీ గుర్తు మారలేదన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారత రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగసభలో మంత్రి కేటీఆర్ తోపాటు ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వల్ల దేశంలో బాగుపడింది ఒక్కరేనని, అదానీ అని అన్నారు.
కాకులను కొట్టి గద్దలకు పెట్టే ప్రభుత్వమని, పెట్రోలు, డీజిల్ పై పన్నుల రూపంలో ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు వసూలు చేశారని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ ఎనిమిది సంవత్సరాల్లో చేసిన అప్పు రూ.100 లక్షల కోట్లు అని, మోడీ దేవుడని బండి సంజయ్ చెబుతున్నారని, మోడీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకుండా తొక్కిపెట్టినందుకా? నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఏడాదికిపైగా చేపట్టిన నిరసనల్లో 700 మంది రైతులు చనిపోయినందుకా? చేనేతలపై 5శాతం జీఎస్టీ విధించినందుకా? ఎందుకు దేవుడో చెప్పాలని డిమాండ్ చేశారు.
Live: BRS Working President, Minister Sri @KTRBRS speaking in a Public Meeting at Jammikunta. https://t.co/vWTO1vy3ZZ
— BRS Party (@BRSparty) January 31, 2023
14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పులను మోడీ ఒక్కరే చేశారన్నారు. మతపరంగా రెచ్చగొట్టడం తప్పితే ఈ జిల్లాకు బండి సంజయ్ ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు. గుజరాతీల చెప్పులు నెత్తిన పెట్టుకునే వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానం ఉంటుందా? అన్నారు.
కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఇటీవల ఈటల రాజేందర్ అన్నారని, ఈటల అనే వ్యక్తి ఉన్నాడని పరిచయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్ కోసం 33 మంది పోటీపడితే ఈటలకు టికెట్ ఇచ్చారు.. ఈటలకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆర్.. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దినట్టు.. తండ్రి లాంటి కేసీఆర్ను పట్టుకుని కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని ఈటల మాట్లాడుతున్నారని, ఇది ఎంతవరకు సబబని, ఎవరి పాలన ఈ దేశానికి అరిష్టమో ప్రజలు ఆలోచించాలని కోరారు.