నొచ్చుకుంటారేమో కానీ ఇది నిజం: టీచర్లకు కేటీఆర్ చురకలు, వాళ్లు ఇష్టపడట్లేదని వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం ప్రయివేటు స్కూల్స్, ప్రభుత్వ ఉపాధ్యాయులకు తనదైన శైలిలో చురకలు అంటించారు. నొచ్చుకున్నా ఫర్వాలేదని చెబుతూ వారికి అక్షింతలు వేశారు.
ఇటీవల తనకు ఓ విద్యార్థి ట్వీట్ చేశారని కేటీఆర్ చెప్పారు. ఉపాధ్యాయుల స్కూల్ టైమింగ్స్ భరించలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారని మంత్రి తెలిపారు.
కొంతమంది నొచ్చుకున్నప్పటికీ ఇది వాస్తవం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సమయపాలన పాటించడం లేదని వాపోయారు. టీచర్లు సరిగా పాఠాలు చెప్పడం లేదని, స్కూల్లో సరిగ్గా ఉండటం లేదన్నారు. లక్షలు పెట్టి కార్పోరేట్ స్కూళ్లలో చదివించి ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
నెహ్రూ నుంచి అన్యాయమే, సోనియా ఊరికే ఇవ్వలేదు: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీసేవ ద్వారా 600 సేవలు
మరో సందర్భంలో కేటీఆర్ రవీంధ్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ మీ సేవ ఆపరేటర్ల అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మీ సేవ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మీ సేవలో 600 సేవలు అందిస్తున్నామని, వాటిని ఇంకా పెంచాలన్నారు.
86 ఏళ్ల తర్వాత ప్రక్షాళన
డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని కేటీఆర్ తెలిపారు. 86 ఏళ్ల తర్వాత భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందన్నారు. వంద శాతం భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచిందన్నారు. సామాన్యుడికి లంచాల బాధ తప్పాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.
ఏ ప్రభుత్వం చేపట్టని సాహసోపేతమైన కార్యక్రమాలు
ఏ ప్రభుత్వం చేపట్టని అద్భుతమైన సాహసోపేతమైన కార్యక్రమాలను చేపడుతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇంటింటికీ మంచినీళ్లతోపాటు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫోన్లు కలిగిన రెండో దేశంగా భారత్ నిలిచింది. టీ వాలెట్ను ఇప్పటికే మూడు లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మీ సేవకు బ్యాడ్బ్యాండ్ ఉచితంగా ఇస్తామన్నారు.
వైద్యులు, ఉపాధ్యాయులు ఇష్టపడట్లేదు
గ్రామాల్లో పని చేయడానికి వైద్యులు, ఉపాధ్యాయులు ఇష్టపడటం లేదని, అందుకే, టీ ఫైబర్ ద్వారా రానున్న రోజుల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. టెక్నాలజీ ఉపయోగించుకోవాలంటే మనకు తెలియాలని, అందుకే డిజిటల్ లిటరసీ అందిపుచ్చుకోవాలన్నారు.