మీ వల్లే చెడ్డపేరు, మళ్లీ అవే కథలు, ఎవరో తెలుసు: అధికారులపై కేటీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు జిహెచ్ఎంసి ఇంజినీరింగ్ అధికారుల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోడ్లు బాగా లేకపోవడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరు అంతా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
చినుకుపడితే చిత్తడిగా మారుతోన్న హైదరాబాద్ రోడ్ల దుస్థితిపై కేటీఆర్ ఈ రోజు జిహెచ్ఎంసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ అధికారులు నగరంలో రోడ్ల మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన ప్రణాళికను కేటీఆర్కు అందించారు.
అన్ని అంశాలను పరిశీలించిన కేటీఆర్ 150 బృందాలుగా ఏర్పడి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. అదే సమయంలో అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్ల కారణంగా ప్రభుత్వం సంపాదించిన మంచి పేరు పోతోందన్నారు. సరిగా పని చేయని అధికారులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇన్నేళ్ల నుంచి పనులు చేస్తున్నా మరమ్మతులు తెలియదా అని ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.
రోడ్ల ప్రస్తుత దుస్థితికి అధికారులో, కాంట్రాక్టులో తనకు తెలుసునని చెప్పారు. ఇప్పటికైనా అసమర్థత ఒప్పుకొని పరిష్కారం చూపాలన్నారు. రెండు నెలల క్రితం ఇవే కథలు చెప్పారన్నారు. మళ్లీ రిపేర్లు అంటూ అవే కథలు చెబుతున్నారన్నారు. జిహెచ్ఎంసి యాంత్రాంగమంతా రిపేర్ల పైన ఉండాల్సిందే అన్నారు.