ఆమ్రపాలి! వాదనొద్దు, కేసీఆర్ వచ్చి నోట్లో ముద్ద పెడతారా: కలెక్టర్-వినయ్లపై కేటీఆర్ ఆగ్రహం
వరంగల్ నగర అభివృద్ధిపై వరంగల్ అర్భన్ కలక్టరేట్లో అధికారులతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
Recommended Video
వరంగల్: వరంగల్ నగర అభివృద్ధిపై వరంగల్ అర్భన్ కలక్టరేట్లో అధికారులతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
చదవండి: డ్రెస్సింగ్పై కెసిఆర్ వార్నింగ్: కలెక్టర్ ఆమ్రపాలిలో మార్పు?
అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరగడం లేదని, ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను నిలదీశారు.
ఆమ్రపాలిపైనా కేటీఆర్ అసహనం
వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని ఇలాంటి సమయంలో అధికారులు, ఎమ్మెల్యే పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలిపై కూడా కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన వరంగల్ అభివృద్ధిపై మరోసారి హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
నిధులు ఇస్తున్నా అధికారులతో పాటు ఎమ్మెల్యే కూడా
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలితో పాటు మున్సిపల్ కమిషనర్, మేయర్, ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రభుత్వం నిధులిస్తున్నా పనులు చేపట్టడంలేదని, కనీసం ప్రతిపాదనలు కూడా చేయలేదని, అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులు కూడా అలసత్వం వహించడం ఏమిటని ప్రశ్నించారు.
ఇంత దారుణంగా చేస్తే ఎలా.. ఆమ్రపాలి, మేయర్, ఎమ్మెల్యేలపై కేటీఆర్
ఐ యామ్ సారీ.. ఇంత అలసత్వం ఉంటే ప్రజలకు ఏవిధంగా జవాబు చెప్తాం? ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీలకే దిక్కులేకుంటే ఎలా? అధికారులు అలసత్వంగా ఉన్నా ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా? వరంగల్ నగర ప్రజల కోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.300 కోట్లు కేటాయించారు కదా! వాటి ప్రతిపాదనలేవి? అసలు ఏం చేస్తున్నారు? మీరు ఇంత దారుణంగా పనిచేస్తే రేపు ప్రజల వద్దకు ఎలా వెళ్తాం? అంటూ కేటీఆర్ కలెక్టర్ ఆమ్రపాలి సహా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పక్కా ప్రణాళికతో రండి
ఇటువంటి పరిస్థితుల్లో తాను రివ్యూ కొనసాగించలేనని, ఈ నెల 24న సాయంత్రం నాలుగు గంటలకు అందరూ హైదరాబాద్లో సమావేశానికి రావాలని ఆదేశించారు. ఏడాదిలోనే పనులు పూర్తయ్యేటట్లు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని వివరాలతో హాజరు కావాలని అన్నారు.
సీఎం వచ్చి నోట్లో ముద్ద పెడతారా
అధికారులు అవసరమైతే బదిలీ చేస్తే వేరే ప్రాంతానికి వెళ్తారని, ప్రజా ప్రతినిధులు ప్రజలకు జవాబు చెప్పాలి కదా అని ఎమ్మెల్యేను కేటీఆర్ నిలదీశారు. ఎమ్మెల్యే వినయ భాస్కర్ను ఉద్దేశించి.. ఏం వినయ్! నిధులిస్తాం.. లక్ష్యాలిస్తాం.. ఇంకే చేస్తాం చెప్పండి? ముఖ్యమంత్రి వచ్చి అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతారా అని అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడేందుకు ప్రయత్నించగా..
నిధులిచ్చినా అభివృద్ధి, పనులపై అతీగతీ లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. డోంట్ ఆర్గ్యూ ఆమ్రపాలి అంటూ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.