కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామాపై మహేందర్ రెడ్డి: కేటీఆర్ పక్కన పెట్టారా?
హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేత, మంత్రి (ఆపద్ధర్మ) మహేందర్ రెడ్డి స్పందించారు. ఆయన పార్టీని ఎందుకు వీడారో తనకు తెలియదని చెప్పారు. తామిద్దరం నాలుగున్నరేళ్లు కలిసి పని చేశామని అన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నామని చెప్పారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. కానీ ఆయన ఏ ఉద్దేశ్యంతో బయటకు వెళ్లారో తనకు మాత్రం తెలియదని చెప్పారు. ఆయన వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజల మనిషి కాదన్నారు. పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీతో పాటు తనకు నష్టం లేదన్నారు.
చివరి నిమిషం దాకా ఆశపెట్టి: కేసీఆర్కు మరో భారీ షాక్, రాజీనామా చేసిన కీలకనేత
ఆధిపత్య పోరే కారణమా?
కాగా, కొండా పార్టీ వీడటానికి ప్రధాన కారణం మహేందర్ రెడ్డితో ఆధిపత్య పోరేనని భావిస్తున్నారు. కేసీఆర్కు పంపిన రాజీనామా లేఖలో వ్యక్తిగత స్థాయిలో, రాష్ట్రం కోసం పని చేసిన కార్యకర్తలకు అన్యాయం, నియోజకవర్గ స్థాయిలో అసంతృప్తి, రాష్ట్రస్థాయిలో, తెరాసలో జరుగుతున్న పరిణామాల కారణంగా రాజీనామా చేస్తున్నానని ఐదు కారణాలు చెప్పారు. కొండా బుధవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో ఆధిపత్య పోరు వల్ల తాను పార్టీని వీడలేదని చెప్పారు. కానీ కారణం మాత్రం అదేనని అంటున్నారు.
కార్యక్రమాల్లో ఎడమొహం, పెడమొహం
కొండా ఒక్కరితోనే తెరాసలో రాజీనామాలు ఆగిపోవని భావిస్తున్నారు. ఆయన వర్గానికి చెందిన పలువురు నేతలు ఉన్నారని, వారు కూడా పార్టీని వీడే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. మహేందర్ రెడ్డికి ప్రాధాన్యం ఇస్తూ తనకు ఇవ్వడంలేదని కొండా భావించారని అంటున్నారు. ఈ విభేదాలు నాలుగేళ్ల నుండే మొదలయ్యాయని చెబుతున్నారు. పలు కార్యక్రమాల్లోను ఇరువురు నేతలు ఎడమొహం, పెడమొహంగా ఉండేవారని చెబుతున్నారు. కొండా వర్గం సూచించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పట్టించుకోలేదట.
కేటీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?
గత రెండేళ్లుగా మహేందర్ రెడ్డికి కేటీఆర్, పార్టీ అధిక ప్రాధాన్యం ఇస్తూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే అభిప్రాయం కొండాలో ఉందని చెబుతున్నారు. తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డిని కొండా వర్గం ప్రోత్సహిస్తోందని, ఇది మహేందర్ రెడ్డి వర్గానికి మింగుడు పడలేదట. దీనిపై ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. కేసుల వరకు కూడా వెళ్లిందని అంటున్నారు. ఆ తర్వాత రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేయడం కొండాను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని చెబుతున్నారు. అప్పటి నుంచి విబేధాలు పెరిగాయట.
విభేదాలు బయటపడి
ఇతర వివాదాలు కూడా ఉన్నాయట. కానీ విభేదాలు ఇప్పటి వరకు బయటపడలేదు. కొద్ది నెలలుగా కొండా పార్టీకి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిని ఆయన ఖండిస్తూ వచ్చారు. నాలుగైదు రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రచారం జరగగా.. ఆయన కొట్టి పారేశారు. అవి ఎట్టకేలకు నిజమయ్యాయి.