కబ్జా ఆరోపణలపై మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్: తాను రెడీ అంటూ థ్యాంక్స్ చెప్పిన రఘునందన్
హైదరాబాద్: తనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 160 ఎకరాల్లో ఏర్పాటు చేసుకున్న ఫాంహౌస్లో ప్రభుత్వ, ఆర్డీఎస్ కోసం సేకరించిన భూములు ఉన్నాయంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఆరోపణలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆధారాల్లేకుండా తనపై అభాండాలు మోపడం సరికాదన్నారు. సాక్ష్యాధారాలుంటే చూపించాలని సవాల్ విసిరారు.
రఘునందన్ రావు ఆరోపణల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు. కావాలంటే ఎప్పుడైనా తన భూమి వద్దకు వచ్చి చూడొచ్చన్నారు. తనపై చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రఘునందన్ రావు చూపిన పత్రాలు శుద్ధ అబద్ధాలని చెప్పారు. సర్వే నంబర్ 60లోని భూముల్లో కేవలం మూడు ఎకరాల భూమి తమ వాళ్లదని స్పష్టం చేశారు. రఘునందర్ రావు ఆరోపణలు తప్పని రుజువైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమేనని చెప్పారు.

తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తన భూమిలో ఫౌల్ట్రీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు. తనకున్న ఆస్తులు.. మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవేనని స్పష్టం చేశారు. తన ఇల్లు రఘునందన్కు ఇచ్చి.. ఆయన ఇల్లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రఘునందన్ వస్తే ఆయన ముందే సర్వే జరిపిస్తామన్నారు. తాము కొన్న భూమి కంటే గుంట ఎక్కువ ఉన్నా.. ఏ చర్యకైనా సిద్ధమని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ను స్వీకరించిన రఘునందన్ రావు
మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన సవాల్కు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నిరంజన్ రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని.. ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తన ఆరోపణలకు స్పందించి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిరంజన్ రెడ్డి కేవలం వనపర్తికే మంత్రిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కాగా, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఫాంహౌస్ కట్టారని రఘునందన్ రావు ఇటీవల ఆరోపించారు. వనపర్తి జిల్లా చండూరు మండలంలో 160 ఎకరాల్లో ఫాంహౌస్ నిర్మించారని అన్నారు. 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని 160 ఎకరాలకు కాంపౌండ్ వాల్ కట్టుకున్నారని ఆరోపించారు. కృష్ణానది లోపలి నుంచి 6 మీటర్ల ఎత్తులో గోడ కట్టారని.. వీటిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు.












Click it and Unblock the Notifications