తాళాలేస్తారా? వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి!
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి గత తొమ్మిది నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానుల సంఘం తీవ్ర నిర్ణయం తీసుకుంది. అద్దె బకాయిలు చెల్లించాలని పదేపదే కమిషన్ కు విజ్ఞప్తి చేసినా బకాయిలు చెల్లించకపోవడంతో అద్దె చెల్లించలేదని పాఠశాలలకు భవన యాజమాన్యాలు తాళాలు వేశాయి.
వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి
రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో అద్దె భవనాలలో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు తాళాలు వేయడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు, గురుకుల పాఠశాలలకు తాళాలు వేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్న మంత్రి పొన్నం ప్రభాకర్
ఇప్పటికి 70 శాతం గురుకులాలు అద్దె భవనాలలోనే ఉన్నాయని గత కొద్ది సంవత్సరాలుగా రాని బకాయిలు గత ప్రభుత్వాలను అడగలేక, నేడో రేపో నిధులు విడుదల చేసే సమయంలో ఇలా గురుకులాలకు తాళం వేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు .ఎవరి మాటలో పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పొన్నం ప్రభాకర్ సూచించారు.
మంత్రి ప్రకటనతో గురుకుల విద్యాలయాల విషయంలో ఆసక్తి
ప్రభుత్వం త్వరితగతిన బకాయిలు చెల్లించే ప్రక్రియ మొదలు పెడుతుందని పాత బకాయిలు ఇప్పించే బాధ్యత కూడా మాదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవనాల అద్దె కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే మంత్రి తాజా స్పందనతో గురుకులాల కోసం అద్దెకు భవనాలను ఇచ్చిన యాజమాన్యం ఎలా స్పందిస్తారు అన్నది తెలియాల్సి ఉంది.
అద్దె చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి రాని స్పష్టమైన ప్రకటన
జిల్లా కలెక్టర్లు దీనిపైన సత్వరం చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఆదేశాలతో ఈ సమస్యను పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్లు ఏం చేయబోతున్నారు అన్నది కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు గురుకుల విద్యాలయాల అద్దె భవనాలకు సంబంధించిన అద్దె చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోగా తాళాలు వేసినందుకు క్రిమినల్ కేసులు పెట్టమనడంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుంది అన్నది అందరిలోనూ ఉత్కంఠ గా మారింది.












Click it and Unblock the Notifications