రేణుకాచౌదరికి మంత్రి పువ్వాడ సవాల్
దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి పువ్వాడ కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ఖమ్మం టార్గెట్ గా మారిందని, అందరూ ఇక్కడకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.
రేణుకాచౌదరికి దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలన్నారు. ఆ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కొన్ని రాజకీయ పార్టీల నేతలకు తాను కలలో కూడా కనిపిస్తున్నానని, తనను తలచుకుంటే వారికి నిద్రపట్టడంలేదన్నారు. అరేయ్.. ఒరేయ్ అంటూ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన చరిత్ర తనకు లేదని, తన తల్లిదండ్రులు తనకు సభ్యత, సంస్కారం నేర్పించారన్నారు.

గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఖమ్మంకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం మంచినీరు కూడా ఇవ్వలేదని, తాను కొండలను మింగుతున్నానంటూ విమర్శలు చేస్తున్నారని, మీ చరిత్ర పబ్బులు, గబ్బులు అని మండిపడ్డారు. టికెట్లు ఇస్తామని గిరిజనుల దగ్గర డబ్బులు వసూలు చేశారని, ఎన్నికల సమయంలో సీజనల్ పక్షుల్లా వచ్చి డబ్బులకు టికెట్స్ అమ్ముకుంటారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
తాను ప్రజల్ని ముంచి ఏనాడు రాజకీయం చేయలేదని, తన గురించి మాట్లాడిన ప్రతి మాటకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఏం మాట్లాడినా ఇకనుంచి ఊరుకునేది లేదని, న్యాయపరంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మూడోసారి ముచ్చటగా విజయం సాధించి అధికారంలోకి రావాలనుకుంటున్న భారత రాష్ట్ర సమితి వినూత్న కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గాలవారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తోంది.












Click it and Unblock the Notifications