తెలంగాణాతో పెట్టుకుంటే జరిగేదిదే.. దాడులకు ప్రతిదాడులు ఉంటాయ్: మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులతో టిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. బిజెపి కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దాడులను సహించేది లేదని తేల్చి చెప్పారు.
ఈడీ, ఐటీ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ మీద కక్షతోనే బిజెపి దాడులు చేయిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ డి, ఐటీ సంస్థలు బీజేపీకి అనుబంధ సంస్థల వలే పనిచేస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని కేంద్రం రకరకాలుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రశాంతంగా ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్న ఆయన అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా మోడీ నిధులు ఇవ్వకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి కేంద్రానికి కనిపించటం లేదా?
20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపికి అక్కడ అవినీతి కనిపించడం లేదా అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వని కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ పెట్టిన మల్లారెడ్డి పై దాడి చేయటం వెనుక ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు.
తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని మీద జరుగుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వెనక బీజేపీ ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా నిధులు ఇవ్వాల్సిన మోడీ, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం అన్యాయం చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
దాడులకు భయపడబోం .. దాడులకు ప్రతిదాడులు ఉంటాయ్
పాలమూరు ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని చెప్పిన మోడీ ఇచ్చిన మాట తప్పారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ముంబై, గోవాలో ఉన్న క్యాసినో లను మూసివేయాలని మోడీని డిమాండ్ చేశారు. అంతేకాదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ గౌడ్ అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై సిట్ విచారణ జరుగుతోందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఈడీ దాడులతో తెలంగాణ ప్రజలు భయపడతారని భావిస్తున్నారని, కానీ తెలంగాణ సమాజం అలా భయపడే సమాజం కాదని, దాడులకు ప్రతిదాడులు ఉంటాయంటూ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం
తెలంగాణ అన్ని రాష్ట్రాలకు భిన్నమని, తెలంగాణ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు, పలువురు నేతలను టార్గెట్ చేసి బిజెపి దాడులు చేయిస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేంద్రం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా చూడాలని కేంద్ర శతవిధాలా ప్రయత్నం చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేంద్రం చేసే కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని, కేంద్రానికి తగిన బుద్ధి చెబుతారని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.