నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని.. ఊరుకోబోనంటూ బీఆర్ఎస్, బీజేపీకి వార్నింగ్
ధాన్యం కొనుగోలు విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు న్యాయం చేస్తున్నామని అన్నారు. తాలు, తరుగు విషయంలో అవినీతి చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలపై మండిపడ్డారు. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెపుతున్నారన్నారు. ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని ధ్వజమెత్తారు. రూ.42కు కిలో సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్నబియ్యంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, సన్నబియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.

మిల్లర్లపై నిబంధనల ప్రకారం పోయే ప్రభుత్వం తమదని ఉత్తమ్ స్పష్టం చేశారు. తనపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.1700 వచ్చిందని, తమ ప్రభుత్వంలో క్వింటాల్ ధాన్యం ధర రూ.2007 పలికిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
రూ.200 కోట్ల ధాన్యం మాత్రమే ఇప్పటివరకు కొనుగోలు జరిగిందన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరి ధాన్యం కొనుగోళ్లలో రూ.2 వేల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు. కేంద్రీయ బండారును బ్లాక్ లిస్టులో పెట్టింది, తీసేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. అందుకే ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ హితవు పలికారు. తాను ఉత్తమ్ కుమార్ రెడ్డినని.. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే అస్సలు ఊరుకోనని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications