వణుకు: ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలతో నయీం లింక్లు
హైదరాబాద్: ఎదురు కాల్పుల్లో హతమైన గ్యాంగస్టర్ నయీంతో సంబంధాలు పెట్టుకున్న రాజకీయ నేతలు, అధికారుల వెన్నులో వణుకు ప్రారంభమైంది. తన సంబంధాలను నయీం గ్యాంగ్ విస్తరించిన తీరు దర్యాప్తు అధికారులకే ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు.
నయీంతో సంబంధాలు పెట్టుకున్నవారిలో ముగ్గురు మంత్రులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే విధంగా ఎనిమిది శాసనసభ్యులతోనూ నలుగురు ఎమ్మెల్సీలతోనూ అతనికి లింకులున్నట్లు చెబుతున్నారు. 18 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నట్లు చెబుతున్నారు. వీరు కాకుండా కింది స్థాయికి చెందిన అధికారుల సంఖ్య లెక్కకు మిక్కిలి ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతికి నివేదిక అందినట్లు వార్తలు వస్తున్నాయి. రౌడీ షీటర్గా, నక్సలైట్గా, గ్యాంగ్స్టర్గా నయీం నడిపిన వ్యవహారాల్లోపోలీసు అధికారులు కూడా అతనికి సహకరించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమగ్ర నివేదికను తెప్పించుకున్నట్లు చెబుతున్నారు.

మీడియాలో విశ్వసనీయ కథనాలంటూ వచ్చిన వార్తల ప్రకారం - ఆ నివేదికలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులు, అనేక మంది బడా రాజకీయ నేతలు, రిటైర్డ్ అధికారుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నేతలు జాబితాలో అత్యధికంగా ఉన్నారు.
వారిలో ప్రతిపక్ష నేతలే కాకుండా అధికార పక్షం నేతల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్న నేతల్లో అత్యధికులు గతంలో వేర్వేరు పార్టీల్లో పని చేశారు. వారికి అప్పట్లోనే నయీంతో సంబంధాలు ఏర్పడ్డాయని అంటున్నారు. వేగంగా ఆర్థికంగా ఎదిగి రాజకీయాల్లో దూసుకొచ్చిన వారు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పదవులు పొందిన వారు కూడా నయీం లబ్ధిదారుల జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
వారిలో రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లా నేతలే ఎక్కువగా ఉన్నారు. వీరిలో ప్రస్తుత ప్రజా ప్రతినిధులతో పాటు మాజీలు కూడా ఉన్నారు. నయీంతో సంబంధాలు పెట్టుకున్నారని భావిస్తున్న ముగ్గురు మంత్రుల్లో ఇద్దరు గతంలో వేరే పార్టీలో ఉన్నారు. అప్పటి నుంచే వీరికి నయీంతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది.
ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో నల్లగొండ జిల్లా నుంచి ఒకరు, రంగారెడ్డి నుంచి ముగ్గురు, వరంగల్లో ఇద్దరు, హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు ఉన్నట్లు తెలిసింది. నయీంకు ఎమ్మెల్సీలతోనే స్నేహం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వారిలో నల్లగొండ జిల్లాలో ఇద్దరు, వరంగల్ జిల్లాలో ఇద్దరికి నయీంతో సాన్నిహిత్యం ఉన్నట్లు తెలిసింది.
నల్లగొండ జిల్లాకు సంబంధించి ఇద్దరు మాజీ మంత్రులతో కూడా నయీంకు సంబంధాలున్నట్లు ముఖ్యమంత్రికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. నయీం పేరుతో, నయీంతోనే భారీగా సెటిల్మెంట్లు చేయించినవారిలో భువనగిరికి చెందిన ఓ నేత ఉన్నారు. ఆయన పలుమార్లు భువనగిరి నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, గెలవలేదు.
నల్లగొండకే చెందిన మరో నేతకు కూడా నయీం నుంచి అనేక గిప్టులు వెళ్లాయి. నల్లగొండ జిల్లాలో నయీం చేసిన అనేక ఆపరేషన్లకు ఇతనే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక, మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు నేతలు కూడా నయీం జాబితాలో ఉన్నట్లు తెలిసింది. మొత్తంగా 56 మంది నేతల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు తెలిసింది.
నయీంకు పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో దాదాపు 42 మంది అధికారులు సహకరించినట్లు నివేదికలో చెప్పారని అంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఉన్నతాధికారులే ఉన్నట్లు సమాచారం. జాబితాలో 18 మంది ఐపిఎస్ అధికారులున్నట్లు సమాచారం. వీరిలో సర్వీసులో ఉన్నవారు 9 మంది, రిటైర్ అయిన వారు మరో 9 మంది ఉన్నారు. మిగతా వారు కింది కేడర్ అని సమాచారం.
నక్సల్స్ వ్యవహారాలపై నిఘా పెట్టే స్పెషల్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐబీ)లో పనిచేసి రిటైర్ అయిన వారిలో ఆరుగురు ఎస్పీ కేడర్ అధికారులకు నయీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు నివేదికలో చెప్పారు.












Click it and Unblock the Notifications