శంషాబాద్లో అదృశ్యమై నల్గొండలో హత్య చేయబడ్డ 14 ఏళ్ల బాలిక శివలీల
హైదరాబాద్: కిడ్నాప్కు గురైన శంషాబాద్కు చెందిన 14 ఏళ్ల బాలిక శివలీల హత్య చేయబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ బృందావన కాలనీకి చెందిన నాగయ్య, పద్మ దంపతుల కుమార్తె శివలీల అనే బాలిక ఈ నెల 6న అదృశ్యమైంది. బాలిక మృతదేహం నల్గొండ జిల్లా మోత్కూరు గ్రామ శివారులో కనిపించింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన శంషాబాద్ పోలీసులకు నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం మోత్కూరు గ్రామ శివారు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి విచారించారు. శివలీల దుస్తులు ఆధారంగా మృతదేహం శంషాబాద్లో అదృశ్యమైన శివలీలదేనని నిర్ధారించారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును నమోదు చేసుకున్న ఆర్జీఐఏ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివలీలను ఎవరు నల్లగొండ తీసుకెళ్లారన్న విషయమై సమాచారం లేదని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
శివలీల కుటుంబ సభ్యులు మాత్రం రాజు అనే వ్యక్తి పైన అనుమానముందని పోలీసులకు తెలియజేశారు. రాజుతో శివలీల సన్నిహితంగా ఉన్నట్లుగా సమాచారం. అతనే అక్కడి తీసుకెళ్లి చంపాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందుతుడి రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.