ఆ పదం నిషిద్ధమా? ఈటలకు నోటీసులు ఎలా?: ప్రశాంత్ రెడ్డికి రఘునందన్ సవాల్
హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేవన్నట్లుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం దారుణమన్నారు.
ఆ పదాన్ని నిషేధించారా?: రఘునందన్ రావు
అసెంబ్లీ సమావేశాలు మరీ రెండ్రోజులే నిర్వహించడం విడ్డూరమని మండిపడ్డారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై.. నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునంన్ రావు మండిపడ్డారు. మరమనిషి అనేది నిషిద్ధ పదమా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు.
అసెంబ్లీలోకి బీజేపీని రానీయకుండా కుట్రలు: రఘునందన్ రావు
బీజేపీ ఎమ్మెల్యేల పట్ల అసెంబ్లీలో వివక్ష జరుగుతోందని ఆరోపించారు. బల్లాలు ఎక్కి, మైకులు విసిరి, గవర్నర్ కుర్చీనే తన్నినప్పుడు ఈ సభా సంప్రదాయం ఎక్కడికి పోయిందని మంత్రి ప్రశాంత్ రెడ్డిని రఘునందన్ ప్రశ్నించారు. మరమనిషి అంటే సభా సంప్రదాయాలను అగౌరవపరిచినట్లా? అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలకు బీజేపీని రానీయకుండా చేసేందుకు మంత్రులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. 20 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలని కాంగ్రెస్, మజ్లిస్ బీఏసీలో ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒక్కటేనని అన్నారు.
కుర్చీ వెతుక్కునేలోపే సభను వాయిదా వేశారంటూ రఘునందన్
తమకు మూడ్రోజులు మాట్లాడే అవకాశం లభిస్తుందనుకున్నామని, కానీ తాము కుర్చీలు వెతుక్కునేలోపే ఆరు నిమిషాల్లో అసెంబ్లీ వాయిదా పడిందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. బీఏసీ సమావేశానికి బీజేపీని కూడా పిలవాలని స్పీకర్ను కోరామన్నారు. గత ప్రభుత్వాలు సీపీఎం, లోక్సత్తా పార్టీల ఎమ్మెల్యేలు ఒక్కరే ఉన్నా వారిని కూడా బీఏసీ భేటీకి పిలిచారని గుర్తు చేశారు.
ఈ విషయాన్ని కూడా స్పీకర్ వద్దకు తీసుకెళ్లామని.. అయినా ఆయన మమ్మల్ని సమావేశానికి అనుమతించలేదన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ భేటీకి ఆహ్వానిస్తారో సభాపతి చెప్పాలన్నారు. అసెంబ్లీ ఇచ్చే నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు రఘునందన్ రావు.
మంత్రి ప్రశాంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్
అంతేగాక, నిజామాబాద్కు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన రోజు స్పీకర్ను మరమనిషి చేసింది మంత్రి ప్రశాంత్ రెడ్డి అని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన నిబంధనల పుస్తకం(రూల్ బుక్) తీసుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సిద్ధంగా ఉండమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సాంప్రదాయాలను రద్దు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. కాగా, స్పీకర్ కు ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పాలని లేదంటే చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే.