కేసులు నాకు కొత్తేమీ కాదు.. ఉడుత ఊపులకు భయపడను: ఎమ్మెల్యే రఘునందన్ రావు
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసు తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య విమర్శల యుద్ధానికి తెరతీసింది. బాలిక గ్యాంగ్ రేప్ ఘటన కు సంబంధించి ఫోటోలు, వీడియోని విడుదల చేయడం పట్ల ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అటు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రఘునందన్ రావును టార్గెట్ చేసిన టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం నేతలు..
రేప్ బాధితురాలి వివరాలను గోప్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రఘునందన్ రావు తుంగలో తొక్కారని ఒక అడ్వకేట్ అయి ఉండి కూడా అత్యాచార బాధితురాలి వివరాలను బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు బయటకు విడుదల చేశారని మండిపడ్డారు. ఇక మరోవైపు పోలీసులు రఘునందన్ రావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలో రఘునందన్ రావు అత్యాచార బాధితురాలి వీడియోలు, ఫోటోలు విడుదల చేయడంపై క్లారిటీ ఇచ్చారు.
ఆమ్నీషియా పబ్ కేసులో ఫోటోలు, వీడియోలపై క్లారిటీ ఇచ్చిన రఘునందన్ రావు
ఈ కేసులో హోంమంత్రి మనవడు ఉన్నాడని తాను చెప్పలేదని, ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని తాను చెప్పినట్టు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మైనర్ బాలిక ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలిపారు. తాను ఫోటోలు, వీడియోలు విడుదల చేయకముందే ఈ ఫోటోలు, వీడియోలు అన్ని టీవీలలో ప్రసారం అయ్యాయని రఘునందన్ రావు పేర్కొన్నారు. బాధిత అమ్మాయి పేరు తాను ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. ఈ కేసులో ఎంఐఎం నాయకులను కాపాడేందుకు మాత్రమే పోలీసు యంత్రాంగం పని చేస్తోందంటూ రఘునందన్ రావు ఆరోపించారు.
తానూ తప్పు చేస్తే కేసు పెట్టుకోవచ్చు.. భయపడేది లేదన్న రఘునందన్ రావు
తాను చేసిన దాంట్లో తప్పు ఏమైనా ఉంటే పోలీసులు తన పైన కేసు పెట్టుకోవచ్చని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. పోలీసు ఉన్నతాధికారి జోయల్ డేవిస్ కు తన గురించి పూర్తిగా తెలుసుకొని పేర్కొన్న రఘునందన్ రావు కేసులు తనకు కొత్త కాదంటూ తేల్చి చెప్పారు. అయినా ఉడుత ఊపులకు తాను భయపడేది లేదని రఘునందన్ రావు స్పష్టం చేశారు. మాజీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు తనను టార్గెట్ చేసే బదులు ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించాలని రఘునందన్ రావు హితవుపలికారు.
బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం
మైనర్ బాలికకు న్యాయం జరగాలని ఉంటే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును అరెస్ట్ చేయాలని ఆందోళన చేయండి అంటూ పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గురూ కలిసి నా మీదకు వస్తున్నారు. మనం తర్వాత కొట్లాడుకుందాం కానీ ముందుగా అమ్మాయికి న్యాయం జరగాలి అంటూ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకూ దోషులకు కఠిన శిక్ష పడే వరకు పోరాడుదాం అంటూ రఘునందన్ రావు తేల్చిచెప్పారు.