టీడీపీలోకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ - తేల్చి చెప్పేసారు..!?
బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ పార్టీ వీడనున్నారా. రాజాసింగ్ బీజేపీ ముఖ్య నేతల తీరుతో అసహనంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలో జరిగే ఎన్నికలకు పార్టీ సిద్దం అవుతున్న వేళ రాజాసింగ్ షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. బీజేపీ నేతల నుంచి తనకు మద్దతు లేదనే అభిప్రాయంతో ఉన్న రాజాసింగ్ బీజేపీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, తిరిగి తాను రాజకీయ జీవితం ప్రారంభించిన టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వివాదాల్లో ఎమ్మెల్యే రాజాసింగ్ : వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా కేసుల్లో చిక్కుకుంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. రాజాసింగ్ పైన నమోదైన కేసుల్లో ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారు. రాజాసింగ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసాయి.

ఈ క్రమంలో రాజసింగ్ ను బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తరువాత తన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ పార్టీ నాయకత్వాని కి లేఖ రాసారు. రాజాసింగ్ తన పైన వరుసగా కేసులు నమోదు అవుతున్నా పార్టీ నాయకత్వం నుంచి మద్దతు లేదనే ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. తాను ఏదైనా కార్యక్రమం చేపట్టినా పార్టీ నుంచి సహకారం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు.
టీడీపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం : బీజేపీలో ఎదురవుతున్న పరిణామాలతో రాజాసింగ్ పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను ఆయన రెండు రోజుల క్రితం వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చల్లో తిరిగి టీడీపీలో చేరాలని ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
రాజాసింగ్ రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది. 2009 నుంచి 2014 వరకు రాజాసింగ్ జీహెచ్ఎంసీ టీడీపీ కార్పోరేటర్ గా పని చేసారు. ఆ తరువాత బీజేపీలో చేరిన రాజాసింగ్ 2014, 2018 ఎన్నికల్లో వరుసగా బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉన్నా.. రాజాసింగ్ తన తీరు కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

రాజాసింగ్ క్లారిటీ : టీడీపీలో చేరితే గోషామహల్ తో పాటుగా పొరుగున ఉన్న మరో రెండు నియోజకవర్గాల్లోనూ ప్రభావం ఉంటుందదని తెలంగాణ టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లోనూ రాజాసింగ్ చెప్పిన వారికే టికెట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. బీజేపీ నేతలతో ఫైనల్ గా చర్చించిన తరువాత టీడీపీలో చేరే విషయం పైన నిర్ణయం ప్రకటించేందుకు రాజాసింగ్ సిద్దం అవుతన్నారని అనుచరుల నుంచి సమాచారం అందుతోంది.
అయితే, బీజేపీ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న వేళ రాజాసింగ్ పార్టీ మారితే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రాజాసింగ్ బీజేపీలోనే కొనసాగుతారని హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబతున్నారు. బీజేపీని వీడే ఆలోచన లేదని రాజాసింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. తన మెంటాలిటీకి బీజేపీ తప్ప ఏదీ సరిపోదని రాజాసింగ్ చెబుతున్నారు. దీంతో, రాజాసింగ్ ఫైనల్ గా ఏం చేస్తారనే చర్చ బీజేపీలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications