చంద్రబాబుతోనే రాజేందర్ రెడ్డి గేమ్: ముచ్చట పెట్టి ప్లేటు ఫిరాయింపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన రాజేందర్ రెడ్డి ఏకంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే గేమ్ ఆడారు. గురువారం సాయంత్రం ఏర్పాటైన తెలంగాణ టిడిపి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు.
పక్కన కూర్చుని కాసేపు చంద్రబాబుతో ముచ్చట కూడా పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన ఆ సమావేశంలో ఆయన కూడా మాట్లాడారు. సంక్షోభ సమయంలో పార్టీకి అండగా ఉండాలని చెప్పారు. ఇంకా చాలానే మాట్లాడారు. దాంతో ఆయన టిడిపిలో ఉండడం ఖాయమని నిర్ధారించుకున్నారు.
కానీ అంతలోనే ఆయన ప్టేట్ ఫిరాయించారు. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమయంలో మెల్లగా సమావేశం నుంచి జారుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణ వద్ద ప్రత్యక్షమయ్యాడు. అప్పటికే అక్కడ తెలంగాణ మంత్రులు కెటి రామారావు, హరీష్ రావు అన్నారు.
ఆ ఇద్దరు మంత్రులతో చర్చించిన తర్వాత తాను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతున్నట్లు రాజేందర్ రెడ్డి ప్రకటించారు. దాంతో తెలంగాణ టిడిపి నాయకత్వం కంగు తిన్నది. రాజేందర్ రెడ్డి చేరికతో మొత్తం తెలంగాణలో రాజకీయమే మారిపోయింది.