MLA Seethakka : ఎమ్మెల్యే సీతక్కకు తీవ్ర అస్వస్థత... ఏటూరు నాగారం ప్రభుత్వాస్పత్రికి తరలింపు
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ములుగు జిల్లా ఏటూరు నాగారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆమె సొమ్మసిల్లిపోయారు.దీంతో వెంటనే అప్రమత్తమైన కార్యకర్రతలు సీతక్కను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సీతక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఏటూరు నాగారం మండల కేంద్రంలో మంగళవారం(సెప్టెంబర్ 21) సీతక్క నేత్రుత్వంలో దళిత గిరిజన దండోరా యాత్ర జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు 4కి.మీ మేర సీతక్క పాదయాత్ర చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు.అనంతరం కార్యాలయం బయట కూర్చొన్న సమయంలో సీతక్క ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు.శరీరమంతా చెమటలు పట్టాయి.అక్కడే ఉన్న కార్యకర్తలు ఆమెకు కొద్దిపాటి సపర్యలు చేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం సీతక్క అక్కడే చికిత్స పొందుతున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.సీతక్క అస్వస్థతకు గురవడంతో కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందారు.సమయానికి ఆస్పత్రిలో సూపరింటెండెంట్ లేకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యే సీతక్క తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.అన్ని వర్గాల్లోనూ ఆమెను అభిమానించేవారున్నారు.కోవిడ్ సమయంలో అటవీ ప్రాంతాల్లోని మారూముల గ్రామాలకు కాలినడకన వెళ్లి ఆమె సహాయం చేసిన తీరును ఎవరూ మర్చిపోలేరు.పేదలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వారిని ఆదుకోవడంలో,వారి తరుపున పోరాడటంలో సీతక్క ముందుంటారు.అందుకే జనం ఆమెను పీపుల్స్ లీడర్ అని పిలుస్తారు.
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత :
హైదరాబాద్లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.నిన్న కేటీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ ఇంటి వద్ద ఆయన దిష్ఠి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు.ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.కర్రలతో రేవంత్ అనుచరులు టీఆర్ఎస్ శ్రేణులను తరిమికొట్టారు. ఈ సందర్భంగా ఇరువురు రాళ్ల దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
మంత్రి కేటీఆర్,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య 'డ్రగ్స్'వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైట్ ఛాలెంజ్కు రేవంత్ సవాల్ విసరగా కేటీఆర్ దానికి కౌంటర్ ఇచ్చారు. చర్లపల్లి బ్యాచ్తో కలిసి తాను టెస్టులకు రానని... రాహుల్ వస్తే ఇద్దరం కలిసి ఎయిమ్స్లో టెస్టులు చేయించుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు.దీనిపై స్పందించిన రేవంత్... కేటీఆర్ నా వెంట్రుకతో సమానమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వినియోగంపై వైట్ ఛాలెంజ్ విసిరితే మంత్రి కేటీఆర్ ఎందుకంతలా ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. సవాల్ స్వీకరిస్తాడనుకుంటే... తనపై తిట్ల దండకం అందుకున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ కూడా తనతో వస్తే ఢిల్లీ ఎయిమ్స్లో కలిసి టెస్టులు చేయించుకుంటామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. రాహుల్ కూడా అందుకు సిద్ధపడితే... అప్పుడు ఇవాంకా ట్రంప్ రావాలంటేడేమోనని ఎద్దేవా చేశారు.కేటీఆర్ను తాను సూటిగా ఒకటే అడుగుతున్నానని... వైట్ ఛాలెంజ్తో రాష్ట్ర యువతకు ఆదర్శంగా ఉందామని మరోసారి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications