రెచ్చిపోతున్న కాంగ్రెస్: ప్రగల్భాలకి హెచ్చరిక.. జానా, జనవరి 1న సెలవు
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుపొందిన నేపథ్యంలో ఆ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గెలుపు ఉత్సాహం నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వంపై బుధవారం విరుచుకుపడుతున్నారు.
నల్గొండ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, డికె అరుణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన పైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత జానా రెడ్డి కూడా తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా తెరాస ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పారని జానా రెడ్డి అన్నారు. ప్రగల్భాలు, ప్రలోభాలకు ఈ ఫలితాలు హెచ్చరిక అన్నారు.
అధికార, ధన బలంతో మహబూబ్నగర్లో తెరాస నెగ్గాలనుకుందని కాంగ్రెస్ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన దామోదర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు వాస్తమేంటో తెలుసుకుని కాంగ్రెస్కు విజయాన్ని అందించారన్నారు. విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్తో బండారు దత్తాత్రేయ భేటీ
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం కేంద్రమంత్రి రాధామోహన్ సింగ్ను కలిశారు. తెలంగాణ తాజా పరిస్థితి పైన ఆయన వివరించారు. కరువు ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 1న సెలవు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1వ తేదీన సెలవును ప్రకటించింది. జనవరి 1 నూతన అంగ్ల సంవత్సరం. కాగా, కెసిఆర్ దంపతులు బుధవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్కు వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.