తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో మోడీ ఫొటోలు??
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, ఉచిత పథకాలు అమలవనీయకుండా వ్యవహరిస్తోందంటూ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. నిజామాబాద్లో జరిగిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. భవిష్యత్తులో ప్రతి ఇంట్లో ఇద్దరికి పింఛన్లు ఇచ్చేంతగా రాష్ట్ర ప్రభుత్వ సంపద పెరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవిత కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
పింఛన్లు వద్దని, రేషన్ లాంటి పథకాలను తీసేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెబుతున్నారని, ఆయన రూ.10 లక్షల కోట్లను తన మిత్రులకు పంచిపెట్టడం ఏ పథకమని ప్రశ్నించారు. ఏదో ఒక కారణాలతో పథకాలను అమలు చేయనివ్వకుండా చూడటానికి కేంద్రం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందన్నారు. నిజామాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ ఫొటో పెట్టకపోవడం గురించి కలెక్టర్ తో గొడవ పడటం చిత్రంగా ఉందన్నారు.
ప్రధానమంత్రి ఫొటోలు రేషన్ దుకాణాలవద్ద పెట్టాల్సిన అవసరం ఉందా? అన్నారు. ఆమె కోరినట్లే పెట్రోల్ బంకుల్లో, యూరియా బస్తాలమీద మోడీ ఫొటో పెడతామన్నారు. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితులను సృష్టించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని, వాట్సాప్ లో వచ్చే తప్పుడు ప్రచారాలను యువత ఖండించాలని సూచించారు. నిత్యావసరాల ధరలు కేసీఆర్ పెంచలేదని, పక్కనే ఉన్న మహారాష్ట్రలో నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రధానమంత్రికి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారనే నమ్మకం తనకుందనే ఆశాభావాన్ని కవిత వ్యక్తపరిచారు.