దేశ భవితను అంధకారం చేసిన మోదీ.!కేసీఆర్ కు రైతులే ఉరి వేస్తారు.!పీపుల్స్ మార్చ్ లో భట్టి ఫైర్.!
మధిర/హైదరాబాద్ : యాసంగిలో వరి కొనుగోలు చేయకపోతే ప్రధాని మోడీకి, సీఎం చంద్రశేఖర్ రావుకు రాజకీయంగా రైతులు ఉరి వేస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హెచ్చరించారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి టిఆర్ఎస్ పాలకులు ఇక రాజకీయ డ్రామాలు ఆపాలన్నారు. రైతులకు భరోసా కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు తమ బాధ్యతను విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే బిజెపి, టీఆర్ఎస్ నాయకులను వరి ధాన్యం కొనుగోలు పై నిలదీయాలని పిలుపునిచ్చారు.
వరి కొనుగోలు చేయకపోతే రైతులే ఉరి వేస్తారు.. కేంద్ర రాష్ట్రాలను హెచ్చరించిన సీఎల్పీ నేత భట్టి
ధరలు ఎందుకు పెంచుతున్నారో, మళ్లీ వాళ్ళే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో ప్రజలే నిలదీయాలన్నారు భట్టి. మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, టిఆర్ఎస్ సర్కార్ కరెంటు చార్జీల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపుతూ వాళ్ళే ధర్నాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. దొంగే దొంగా దొంగా అన్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజ మెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని నవభారత నిర్మాణం చేస్తే.. కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాలయలు జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తడం లేదని అన్నారు.
దేశ భవిష్యత్తును అంధకారం చేసిన మోడీ.. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడన్న భట్టి
ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసి, సింగరేణి, ఎయిర్ పోర్ట్, సీ పోర్టులను ప్రైవేటీకరణ పేరిట అంబానీ ఆదానిలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సంపదను కొల్లగొట్టి దేశ భవిష్యత్తును మోడీ అంధకారంలోకి నెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటి ఫికేషన్ వేస్తామని ప్రకటించిందన్నారు. మిగతా ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో వెల్లడి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 9న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటన చేసి 18 రోజులు దాటుతున్న అధికారికంగా నోటిఫికేషన్ వేయకపోవడం నిరుద్యోగుల్లో అనుమానాలను రేకెత్తిస్తుందని పేర్కొన్నారు.
అధికారంలో ఉండి ధర్నాలు రాస్తారోకోలా.? టీఆర్ఎస్ ను కడిగేసిన భట్టి..
దళిత బంధు డబ్బులు ఇప్పిస్తాను తమవెంట రావాలని కొందరు, లక్ష రూపాయలు ఇస్తే ఇప్పిస్తానని మరికొందరు ఇలా వసూలు దందా చేసే బ్రోకర్ల మాటలను నమ్మొద్దని, ఇలాంటి అక్రమ దందా పాల్పడేవారిని మహిళలు చీపిరి కట్ట తిరిగేసి కొట్టాలని పిలుపునిచ్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని, ఏ ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గంలో బ్రోకర్లకు తావులేదన్నారు. పారదర్శకంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం చింతకాని లో ఇప్పించే బాధ్యత తనదేనని మరోసారి భట్టి పునరుద్ఘాటించారు.
కదంతొక్కుతున్న జనం.. పీపుల్స్ మార్చ్ లో దూసుకెళ్తున్న విక్రమార్క..
రాజకీయాలకతీతంగా దళిత బంధు డబ్బులు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని మంత్రి, కలెక్టర్కు గట్టిగా చెప్పానని వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్న ప్రజల కన్నీళ్లు తుడవడానికే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని స్పష్టం చేశారు. తన అడుగులో అడుగు వేసి కదం తొక్కితే ప్రభుత్వాలు దిగి రాక తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తన అడుగులు ఆగవని, పాదయాత్ర ఆగదని భట్టి స్పష్టం చేశారు.