కొదమ సింహాల పోరు: ఈటల ఇంటికి అమిత్ షా - వేడెక్కిన తెలంగాణ
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఇవ్వాళ నిర్వహించ తలపెట్టిన రెండు కార్యక్రమాలు పోటాపోటీగా సాగనున్నాయి. ఎత్తుకు పైఎత్తు వేస్తోన్నాయి. ఆధిపత్య పోరును మొదలు పెట్టాయి. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికతో పాటు వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమ రాజకీయ బలాన్ని చాటుకోవడానికి ఇవ్వాళ్టి కార్యక్రమాలు వేదికగా మారాయి.
జాతీయ సమైక్యత దినోత్సవం..
తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాళ జాతీయ సమైక్యత దినోత్సవాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ ఉదయం పబ్లిక్ గార్డెన్స్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం లోయర్ ట్యాంక్బండ్ వద్ద గల ఎన్టీఆర్ స్టేడియంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బంజారాహిల్స్లో కొత్తగా నిర్మించిన బంజారా, ఆదివాసీ భవనాలను ఆయన ప్రారంభించనున్నారు.
రాజ్భవన్లో..
జాతీయ సమైక్యత దినోత్సవాలకు భిన్నంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించుకోనున్నారు. రాజ్భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. తెలంగాణ విమోచనోద్యమ పోరాటాలు-త్యాగాలు అనే అంశంపై వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ చేరిన అమిత్ షా..
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, కొందరు బీజేపి నేతలు, అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా శివరాంపల్లిలో ఉన్న నేషనల్ పోలీస్ అకాడమీకి బయలుదేరారు. రాత్రి అక్కడే బస చేశారు.
ఈటల ఇంటికి..
ఇవ్వాళ కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోన్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న విమోచన అమృతోత్సవ్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లానున్నారు. ఈటల తండ్రి మల్లయ్య ఇటీవలే అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. దీనితో అమిత్ షా ఆయన కుటుంబాన్ని పరామర్శించనున్నారు.