వీడియో: గేటు వద్ద మనోజ్- బౌన్సర్లను వెల్లగొట్టిన విష్ణు: మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
Manchu Vishnu: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో ఆస్తి తగాదాలు రచ్చకెక్కాయి. విభేదాలు వీధిన పడ్డాయి. అభిప్రాయభేదాలు భగ్గుమన్నాయి. పరస్పరం భౌతికంగా దాడులు చేసుకునేంత వరకూ వెళ్లాయి. చివరికి- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత పరిస్థితి తలెత్తింది.
తన భార్య భూమా మౌనిక రెడ్డిపై తండ్రి మోహన్ బాబు దాడి చేశారంటూ ఆయన కుమారుడు, నటుడు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తననూ కొట్టాడంటూ మనోజ్ లిఖిత పూరకంగా పహాడీ షరీఫ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి ప్రతిగా మోహన్ బాబు కూడా మంచు మనోజ్పై ఫిర్యాదు చేశారు. మనోజ్, కోడలు మౌనిక తనను కొట్టారంటూ రాచకొండ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారాయన.

ఈ మేరకు మోహన్ బాబు రాచకొండ పోలీస్ కమిషనర్కు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. మనోజ్ వల్ల తనతో పాటు భార్య ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీన తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు అలజడి సృష్టించారని, భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
దీని తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ గొడవల నేపథ్యంలో దుబాయ్లో ఉన్న మోహన్ బాబు పెద్ద కుమారుడు, నటుడు మంచు విష్ణు హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారు. కొద్దిసేపటి కిందటే జల్పల్లి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయన తమ్ముడు మనోజ్.. గేటు వద్దే బైఠాయించారు. ఆయనతో మాట్లాడకుండా లోనికి వెళ్లారు.

ఇంటి ఆవరణలో ఉన్న బౌన్సర్లందరినీ బయటికి పంపించారాయన. వాళ్లందరూ కూడా మంచు మనోజ్కు చెందిన బౌన్సర్లుగా చెబుతున్నారు. ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దంటూ ఆదేశించారు. ఇది తమ కుటుంబ సమస్య అని, అందరం కూర్చుని తామే పరిష్కరించుకుంటామనీ అన్నారు.
మనోజ్కు చెందిన బౌన్సర్లు, ఆయన మనుషులను విష్ణు బౌన్సర్లు బయటికి పంపించే సమయంలో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. వారందరినీ బయటికి పంపించి గేటు మూసివేశారు. లోపలికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి లేదంటూ వాళ్లు తేల్చి చెప్పారు.
అదే సమయంలో మంచు మనోజ్ గేటు వద్దే నిల్చుని కనిపించారు. లోనికి వెళ్లడానికి ఇష్టపడలేదు. తన మనుషులను కాంపౌండ్ నుంచి బయటికి పంపించడాన్ని తప్పుపట్టినట్లు తెలుస్తోంది. తన వాళ్లందరినీ బయటికి పిలిపించుకున్నార. అక్కడే కుర్చీ వేసుకుని కూర్చున్నారు.












Click it and Unblock the Notifications