ఎన్నికల్లో దొంగదారుల్లో డబ్బు, మద్యం తరలింపు.. వాటిపై నిఘా కన్నేది?
తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న పార్టీల అభ్యర్థులు ఇప్పటికే హోరాహోరీగా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. మూడోసారి గెలిచి మళ్ళీ అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తూ ఏకంగా కేసీఆర్, కేటీఆర్ లు రంగంలోకి దిగి బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్, బీజేపీలు జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపి బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రలోభాల పర్వానికి శ్రీకారం చుడుతున్నారు రాజకీయ పార్టీల నాయకులు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి భారీగా నగదును, మద్యాన్ని పంపిణీ చేయాలని భావిస్తున్నారు. డబ్బు, మద్యం పంపిణీకి, పోలీసులకు పట్టుబడకుండా దొంగ దారులను వెతుకుతున్నారు.

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపయోగాలు అన్న చందంగా డబ్బు పంపిణీ చేయడానికి, మద్యాన్ని రవాణా చేయడానికి దొంగ దారులు వెతుకుతున్న పార్టీల అభ్యర్థులు కొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో, పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేయని రవాణా వ్యవస్థ పై దృష్టి సారించారు.
బస్సులలోను, ఆర్టిసి కార్గోలలో, అంబులెన్స్ లలో డబ్బులు, మద్యాన్ని తరలింపు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కొందరు నేతలు అయితే పాదచారుల ద్వారా కూడా డబ్బు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పుష్ప సినిమా తరహాలో నిత్యావసర వస్తువులను సరఫరా చేసే సరుకు రవాణా గూడ్స్ వాహనాల ద్వారా కూడా డబ్బు తరలింపుకు పాల్పడుతున్నారు.
రైల్వే కార్గో ల ద్వారా డబ్బు తరలింపు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటి పైన కూడా దృష్టి సారించాలని, వీటిపైన కూడా నిఘా పెట్టాలని పోలీసులకు పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఉన్న నేతలు ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఓటర్లను ప్రలోభ పెట్టడంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications