తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలే... 16, 17న భారీ వర్షాలు! నిలిచిపోయిన ‘కైలాస్ సరోవర్ యాత్ర’
కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, 16, 17 తేదీల్లో ఆవర్తనం మరింతగా విస్తరించి.
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని, ఆపై 16, 17 తేదీల్లో ఆవర్తనం మరింతగా విస్తరించి, రాష్ట్రంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు మరింత ప్రయోజనం కలుగుతుందని, ముఖ్యంగా పత్తి, కంది, మొక్కజొన్న, సోయా తదితర పంటలకు నీరందుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
ఆగస్టులో ఇప్పటివరకూ సగటుతో పోలిస్తే 36 శాతం లోటు నమోదైంది. నిన్న హైదరాబాద్ లో 4 సెంటీమీటర్లు, బోధ్ లో 3 సెంటీమీటర్లు, సంగారెడ్డి, ఉట్నూరు తదితర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇంకా పలు మండలాల్లో కరవు పరిస్థితే నెలకొని ఉందని, జూలైలో 24.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లో సగటున 5.8 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసిందని అధికారులు తెలిపారు. తెలంగాణలో మొత్తం 584 మండలాలు ఉండగా, 236 మండలాల్లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదని వెల్లడించారు.
నిలిచిపోయిన కైలాస సరోవర్ యాత్ర...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కైలాస సరోవర్ యాత్రను నిలిపివేశారు. అక్కడి మల్సా జిల్లాలో వరదల కారణంగా ముగ్గురు మృతి చెందారు. కైలాస సరోవర్ యాత్రకు వెళ్లిన వారిలో ఏడుగురు తప్పిపోయినట్లు సమాచారం. ప్రయాణికులతో పాటు నలుగురు పారాఫోర్స్ జవాన్లు కూడా గల్లంతయ్యారు. ప్రయాణికులు, పారాఫోర్స్ జవాన్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.