టార్గెట్ 2019: 30 స్థానాల్లో టిక్కెట్లకై తీవ్ర పోటీ, కెసిఆర్ కరుణ ఎవరికీ దక్కునో!
Recommended Video
హైదరాబాద్: ఇతర పార్టీల నుండి వలసలు పెరగడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్లు దక్కుతాయోననే ఆందోళన టిఆర్ఎస్ నేతల్లో నెలకొంది. రాష్ట్రంలోని సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీ నేపథ్యంలో ఎవరికీ టిక్కెట్టు దక్కనుందోననే అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీల్లో బలమైన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టిక్కెట్లను కేటాయించాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారు.
టార్గెట్ 2019: కెసిఆర్ ప్లాన్ ఇదే, సిట్టింగ్లకు గుబులు
అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కెసిఆర్ పలు దఫాలు సర్వేలు నిర్వహించారు. ఆ సర్వే నివేదికలను పార్టీ ఎమ్మెల్యేలకు అందించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని కెసిఆర్ యోచిస్తున్నారు.
30 అసెంబ్లీ సెగ్మెంట్లలో టిక్కెట్ల కోసం పోటీ
తెలంగాణ రాష్ట్రంలోని 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ టిక్కెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్,అచ్చంపేట, కల్వకుర్తి, నారాయణపేట, కొడంగల్,ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో మధి, నల్గొండ జిల్లాలోని మునుగోడు, మిర్యాలగూడ, దేవరకొండ , నల్గొండ నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవేళ్ళ, వికారాబాద్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ నెలకొంది.
ప్రత్యర్థులను బలహీనం చేసేందుకు
ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకుగాను టిఆర్ఎస్ ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లోకి ఆహ్వనించారు. అయితే ఇప్పుడు ఇదే టిఆర్ఎస్కు తలనొప్పిగా మారనుంది. ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో బహు నాయకత్వం గులాబీ బాస్కు ఇబ్బందులు తెచ్చి పెట్టనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మంది టిక్కెట్ల కోసం పోటీ పడుతుండడంతో ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు.అయితే పనితీరు ఆధారంగానే టిక్కెట్లను కేటాయించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అయితే టిక్కెట్లు దక్కని నేతలు ఎన్నికల సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.
సిట్టింగ్లకు టిక్కెట్లు దక్కేనా
2019 ఎన్నికల్లో సిట్టింగ్లకు టిక్కెట్లు దక్కుతాయా లేదా అనే విషయమై స్పష్టత లేదు.సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. అయితే అదే సమయంలో సిట్టింగ్ల పనితీరుపై కెసిఆర్ సర్వేలు నిర్వహించారు. ఆ సర్వే నివేదికలను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అందించారు. ఈ సర్వే నివేదిక ఆధారంగానే టిక్కెట్లను కేటాయించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ అదే జరిగితే రానున్న రోజుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడ టిక్కెట్లు దక్కుతాయా లేదోననే విషయమై అనుమానమే.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లాభమే
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టిడిపి, టిఆర్ఎస్లకు ప్రయోజనంగా ఉంటుంది. కానీ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అంశం మాత్రం కేంద్రం నుండి ఇంకా స్సష్టత రాలేదు. అయితే చంద్రబాబునాయుడు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సమయంలో నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.