కూతురు యువకుడితో వెళ్లిపోయింది: తల్లి తన కొడుకుతో చెరువులో దూకింది
హైదరాబాద్: హైదరాబాదులో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రవర్తనతో విసిగిపోయిన ఓ తల్లి జీవితంపై విరక్తి చెంది నాలుగేళ్ల తన కొడుకుతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది.

ఇన్స్పెక్టర్ ఎంఏ జావీద్ కథనం ప్రకారం - రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలంకు చెందిన వరలక్ష్మి (35) తన కుమారుడు కృష్ణ (4), కూతురు లావణ్య (19)తో కలిసి రాజేంద్రనగర్ మండలం హైదర్షాకోట్ గ్రామంలో నివాసముండేది. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం కూతురు లావణ్య ఓ యువకుడితో వెళ్లిపోయింది. దీంతో వరలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది.

ఈ నెల 15వ తేదీన కొడుకు కృష్ణను తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు ఆమె తన సోదరికి తాను చనిపోవడానికి వెళ్తున్నానని ఎవరూ తనను వెతకవద్దని చెప్పింది. శుక్రవారం ఉదయం లంగర్హౌస్ చెరువులో హుడాపార్కు పక్కన నీటిపై వరలక్ష్మి, ఆమె కొడుకు కృష్ణ మృతదేహాలు తేలియాడుతుండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. కూతురు లావణ్య వెళ్లి పోవడంతో మనస్తాపానికి గురైన వరలక్ష్మి తాను చావడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని ఆమె సోదరి శుక్రవారం పోలీసులకు తెలిపింది. వరలక్ష్మి తనకొడుకును నడుముకు కొంగుతో కట్టుకొని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని ఇన్స్పెక్టర్ ఎంఏ జావిద్ చెప్పారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.












Click it and Unblock the Notifications