నయీం ఇష్యూ: ఉమకు 'కొట్లాడిన' మోత్కుపల్లి అండ, రేవంత్ హెచ్చరిక
హైదరాబాద్: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్ స్టర్ నయీంతో మాజీ మంత్రి, టిడిపి నేత ఉమా మాధవ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల పైన టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు స్పందించారు. ఆమెకు మోత్కుపల్లి అండగా నిలిచారు.
తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దని మోత్కుపల్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నయీం గ్యాంగుతో ఉమా మాధవ రెడ్డికి సంబంధాలు ఉన్నాయనే వార్తలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
కాగా, తెలంగాణలో ఏర్పడనున్న జిల్లాల విషయంలో నల్గొండ జిల్లా టిడిపి నేతల్లోనే విభేదాలు కనిపించిన విషయం తెలిసిందే. భువనగిరిని జిల్లా చేయాలని ఉమా మాధవ రెడ్డి, యాదగిరిగుట్టను చేయాలని మోత్కుపల్లి డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఇరువురు టిడిపి నేతల మధ్య మాయల యుద్ధానికి దారి తీసింది. ఇప్పుడు ఉమకు మోత్కుపల్లి అండగా నిలబడ్డారు. జిల్లాల విషయం వేరు, పార్టీ అంశం వేరు.
అంతకుముందు, గురువారం నాడు రేవంత్ రెడ్డి తమ పార్టీ నాయకురాలు ఉమా మాధవ రెడ్డి పైన వచ్చిన ఆరోపణలను కొట్టి పారేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్ధానంలో ఎలిమినేటి మాధవ రెడ్డి కిందిస్థాయి నుంచి పైకి ఎదిగారన్నారు. ఆయనది మచ్చలేని కుటుంబం అన్నారు.
ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి కూడా కల్మషం లేని వ్యక్తి అని, అలాంటి కుటుంబంపై ప్రభుత్వం దుష్ప్రచారానికి ఒడిగడుతోందన్నారు. మాధవ రెడ్డి కుటుంబం ఒంటరి కాదని, మొత్తం టిడిపి అండగా ఉందన్నారు. ఆ కుటుంబంపై ఈగవాలినా టీడీపీ శ్రేణులు సహించవని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
ఉమా మాధవరెడ్డి కుటుంబానికి నయీంతో సంబంధాలు ఉన్నాయంటూ తెరాస ప్రభుత్వం లీకులు ఇస్తోందన్నారు. కొంత కాలం క్రితం ఓ టీడీపీ ఎమ్మెల్యేపై ఇలాగే రాయించారని, రేపో ఎల్లుండో ఆయన అరెస్టు అవుతాడని పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయన్నారు.
ఆ ఎమ్మెల్యే తెరాసలో చేరగానే నే ఆ కేసు మాయమైపోయిందన్నారు. ఆ వార్త తర్వాత ఏ పత్రికలోనూ కనిపించలేదన్నారు. ఇప్పుడూ ఉమా మాధవ రెడ్డి కుటుంబాన్ని భయపెట్టి తమ పార్టీలో చేర్చుకోవడానికో లేదా తెరాసకు సంబంధించిన వారిపై నుంచి ప్రజల దృష్టి మరల్చడాని కో ఈ ప్రచారాలు నడిపిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా టీడీపీ పైన బురద చల్లేందుకు సీఎం కేసీఆర్ వినియోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత దిగజారి వ్యవహరించలేదన్నారు. సీఎంకు బాగా సన్నిహితుడైన ఓ బడా వ్యాపారవేత్త భూలావాదేవీలో కొందరిని ఇబ్బందిపెడుతుంటే నయీంను ఆశ్రయించారని, ఆ తర్వాతే నయీం ఎనకౌంటర్ జరిగిందని వార్తలొస్తున్నాయన్నారు.
తమ వారికి సంబంధించిన విషయాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం కావాలని ఇతర పార్టీల వారిపై అసత్య ప్రచారాలు చేయిస్తోందన్నారు. తమకు ఈ ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం లేవని, ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిష్పాక్షిక విచారణ జరుగుతుందన్న నమ్మ కం లేదని, నయీంతో సంబంధాలున్న తమ వారిని కాపాడుకొని ఇతరులను ఇరికించే వ్యవహారాలు నడుస్తున్నాయన్నారు.
చీకటి మిత్రులు, వెలుగు మిత్రులు అందరూ బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ప్రభు త్వ లీకులపై మీడియా కూడా సంయమనం పాటించాలన్నారు. మీ వద్ద ఆధారాలుంటే రాయండి లేదా సంబంధిత వ్యక్తుల వాదన కూడా తీసుకోవాలని, ఏదీ లేకుండా కేవలం ప్రభుత్వం చెప్పిందని లీకులు ప్రచారంలో పెట్టవద్దని, తమ గౌరవాన్ని మలినం చేయదవద్దన్నారు.