కేసీఆర్లా నీచంగా చేయలేదు: మోత్కుపల్లి, గవర్నర్తో వేగలేం, 3 నిమిషాలే ఉన్నారు: నన్నపనేని
హైదరాబాద్: గతంలో కూడా పదేళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి నీచమైన పనులు ఎప్పుడూ చేయలేదని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ధ్వజమెత్తారు. తెలంగాణలో కేసీఆర్ను ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.
సీఎంగా ప్రజలకు సేవ చేయాలే తప్ప, ఇతర రాష్ర్టాల సీఎంలను తిడుతూ బతకాలనుకోవడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబును ఏదో ఒకరకంగా అభాసుపాలు చేయాలనుకుంటున్నారని, టీడీపీని తెలంగాణలో లేకుండా కుట్ర చేస్తున్నారన్నారు.
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సీఎం రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు నీకంటే ఎక్కువ శక్తి ఉందని, టీడీపీ చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, భయపెట్టి తెరాసలో చేర్చుకున్నారన్నారని ధ్వజమెత్తారు.
రాజకీయాలను కేసీఆర్ మలినం చేస్తున్నారని, ప్రతీ పాపానికి కేసీఆరే కారకుడన్నారు. క్రిమినల్స్ పైనే ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేశాయో తప్ప ప్రజాప్రతినిధులపై ఇలాంటి ఉద్దంతం ఎక్కడా లేదన్నారు. ఒక ముఖ్యమంత్రి ఫోన్ను ట్యాపింగ్చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇది నిరంకుశ విధానమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మొత్తం కేసీఆర్ కుటుంబం చుట్టూ తిరుగుతుందే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు, మాలమదిగలకు అవకాశమే లేదన్నారు. ఇప్పటికైనా రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలని, ఇరురాష్ర్టాల ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు.
కేసీఆర్ భాష, పంతాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. 1200 మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని హెచ్చరించారు. తెరాస ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తోందన్నారు.
పాకిస్థాన్ - భారత్ మాదిరిగా రెండు రాష్ర్టాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులకు కారకుడన్నారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్కు ఎంత అధికారం ఉందో చంద్రబాబుకు అంతే అధికారం ఉందన్నారు.
చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నంలో ఉండాలే తప్ప నీచ రాజకీయాలు చేసి చరిత్రహీనుడు కావద్దని హెచ్చరించారు. బంగారు తెలంగాణ కాదు భ్రష్టుపట్టించే తెలంగాణను తీసుకువస్తున్నారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం పైన ఇప్పటికే విద్యార్థులు తిరగబడుతున్నారన్నారు. ఆంధ్రావారిని రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు వెంట వస్తారనుకుంటున్నారని, కానీ మంచి పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేసీఆర్కు గుణపాఠం తప్పదన్నారు. తెలంగాణకు చంద్రబాబు, ఎన్టీఆర్ చేసిన దాంట్లో ఆవగింజంత అయినా అభివృద్ధి చేయాలన్నారు.
ఈ గవర్నర్ మాకొద్దు: నన్నపనేని
తెరాసకు అనుకూలంగా పని చేసే గవర్నర్ తమకు వద్దని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ గవర్నర్తో మేం వేగలేమన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఊహాజనితమని గవర్నర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆయన విచారణ జరిపించారా అని అడిగారు. టీఆర్ఎస్ సభల్లో గంటల తరబడి కూర్చునే గవర్నర్ అమరావతికి వచ్చి మూడు నిమిషాలే ఉన్నారన్నారు.
ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఏసీబీ చెప్పింది: హరీష్ రావు
ఓటుకు నోటు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఏసీబీ చెప్పిందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ పైన ఏపీలో కేసులు ఎందుకు పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అరెస్టుల పైన ఏపీ మంత్రులు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
వారిని అరెస్టు చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. అరెస్టులనే తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని చెప్పారు. చంద్రబాబు తన తప్పులుకప్పిపుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నాడని మండిపడ్డారు. చట్టం ముందు ఎవరు అతీతులు కాదన్నారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఏపీ మంత్రులది మేకపోతు గాంభీర్యమన్నారు. టేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని ఒకరు, మాటలు గుదిగుచ్చారని మరొకరు, అసలు అది చంద్రబాబు గొంతే కాదని మరొకరు చెబుతున్నారన్నారు.
కేసీఆర్కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలి: దేవినేని
చంద్రబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్కు నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలని దేవినేని నెహ్రూ అన్నారు. తెరాస అవినీతిని బయటపెట్టాలన్నారు. సీబీఐ విచారణతో కేసీఆర్ దొంగ అని నిరూపించి, హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ప్రజలు తలత్తుకునేలా చేయాలన్నారు.