హైదరాబాద్లో మరో పురాతన మెట్ల బావికి మహర్ధశ: కీలక సంస్థల ఒప్పందం
హైదరాబాద్: నగరంలోని పురాతన కట్టడాలకు కొత్త రూపునిచ్చేందుకు ప్రభుత్వం, అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మరో పురాతన మెట్ల బావి పునరుద్ధరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) సిద్ధమైంది. దాదాపు 300 ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి ఫలక్నుమా బస్ డిపోలో ఉన్న విషయం హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఏప్రిల్ 3న భాగస్వామ్యంగా ఉన్న కల్పనా రమేష్తో కలిసి అధికారులు డిపో లోపల ఉన్న పురాతన మెట్ల బావిని సందర్శించారు.
కాగా, ఫలక్నుమా ప్యాలెస్కు అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావిని.. నిజాం తన వ్యక్తి గత ఈత కొలనుగా వాడేవారని తెలుస్తోంది. ఈ మేరకు దీని పునరుద్ధరణ కోసం తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, జీహెచ్ఎంసీ, సాహీ అనే ఎన్జీవో సంస్థ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

కాగా, గతంలో బన్సీలాల్పేట్లో మూడు శతాబ్దాల కింద నిర్మించిన నాగన్నకుంట మెట్ల బావిని.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కలిసి పునరుద్ధరించారు. బన్సీలాల్పేట మెట్ల బావి పునరుద్ధరణకు ఆరు నెలలపాటు శ్రమించారు. ఈ బావి నుంచి దాదాపు 500 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు. ఈ క్రమంలో పాతకాలపు కత్తులు, దేవతా విగ్రహాలు, ఇంటి సామగ్రి లభ్యమయ్యాయి. వీటన్నింటిని ఈ బావి సమీపంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి ప్రజల సందర్శన కోసం ఉంచారు.
సుమారు 53 అడుగుల లోతున్న ఈ బావిలో సుమారు 22 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ప్రతి రోజూ తెల్లవారేకల్లా సహజసిద్దంగా ఐదు నుంచి అరడుగుల ఎత్తు మేరకు స్వచ్ఛమైన నీరు ఊట ద్వారా వస్తున్నట్టు గుర్తించినట్లు రెయిన్ వాటర్ ప్రాజెక్టు, సహే స్వచ్చంద సంస్థ వెల్లడించింది. కాగా, భూగర్భ జలాల సంరక్షణపై మన్ కీ బాత్లో మాట్లాడే క్రమంలో.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ బన్సీలాల్పేట్ మెట్లబావి గురించి ప్రస్తావించారు. చారిత్రక మెట్లబావికి పునర్ వైభవం తీసుకొచ్చారని.. కాలక్రమేణా మట్టి, చెత్తతో నిండిని ఆ బావి అలనాటి వైభవాన్ని చాటుతోందని ప్రధాని పేర్కొన్నారు. మరోవైపు, ఉస్మానియా యూనివర్సిటీలోని మెట్ల బావులను కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications