ముందస్తు ఫీవర్: కూతురుకు పెద్ద బాధ్యతలు అప్పజెప్పిన గులాబీ బాస్
హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొడుకు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలోకానీ పార్టీ కార్యక్రమాల్లోకానీ దూసుకెళుతున్నారు. ఇక హరీష్ రావు తన దైన శైలిలో దూకుడు పెంచారు. తాజాగా సీఎం కేసీఆర్ తన గారాల పట్టి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితకు బాధ్యతలు అప్పగించారు. తండ్రి అప్పజెప్పిన బాధ్యతలను విజయవంతంగా ముందుకు తీసుకెళతానన్నారు కవిత.
రాజకీయపార్టీలు అన్నీ తమ ప్రచారానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుంటున్నాయి. 2014లో మోడీ ప్రధాని అయ్యేందుకు సోషల్ మీడియా క్యాంపెయిన్ చాలా ఉపయోగపడింది. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సోషల్ మీడియావైపు దృష్టిసారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎంపీ కవితకు టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఆ యువ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ..! తెలంగాణాలో మారుతున్న రాజకీయం..!
ఇప్పటి నుంచి కవిత గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి సంబంధించిన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయ్యేలా మానిటర్ చేస్తారు. ఇప్పటికే సోషల్ మీడియా కోసం పనిచేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వ్యక్తులను కూడా నియమించుకోవడం జరిగిపోయిందని సమాచారం.
సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్గా ఉంటారు కాబట్టి దీన్నే తమ ప్రచారానికి వేదికగా వినియోగించుకోవాలని గులాబీ బాస్ తలచినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సిందిగా టీఆర్ఎస్ తాజామాజీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను ఎంపీ కవిత ఆదేశించినట్లు గులాబీ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల స్పందన కూడా తెలియజేయాలని నిజామాబాద్ ఎంపీ ఆదేశించారు. అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా టీమ్తో కలిసి కవిత పర్యటించి అక్కడ జరిగిన జరుగుతున్న అభివృద్ధిని సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేయనున్నట్లు సమాచారం.