టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చేసిన ఎంపీ కవిత!
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితికి ఆ పార్టీ నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కొత్త నిర్వచనం ఇచ్చారు. ఆమె మాటలో టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రైతు సమితి అని. గురువారం టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభా వేదిక వద్ద ఓ మీడియా ఛానెల్తో కవిత మాట్లాడారు.
రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధే తమ నినాదమని ఉద్ఘాటించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రకటించారు. కేసీఆర్ ప్రసంగం కోసం రైతులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.
నేటి సభలో ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే.. భవిష్యత్లో చేపట్టబోయే కార్యక్రమాలను గురించి సీఎం వివరిస్తారని కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా విజయవంతమేనని అన్నారు.
ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణకు వరంగల్ నగరం ఉద్యమ దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఓరుగల్లు నగరంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగడం సంతోషించదగ్గ విషయమని కవిత అన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.