మేం మోసం చేయలేదు.. ఆ నమ్మకమే గెలిపించింది.. ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. కేసీఆర్ నాయకత్వంపై ఎలాంటి అపోహలు, ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోకుండా విశ్వాసం చూపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంచనాలకు తగినట్టే ఫలితాలు స్పష్టమయ్యాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత తన వంతుగా శ్రమించారు. ముఖ్యంగా జగిత్యాల అభ్యర్థి కోసం కవిత ప్రచారం చేయడం కలిసి వచ్చింది. ఎన్నికల ఫలితాలపై ఎంపీ కవిత స్పందిస్తూ..
ఓటమి భారాన్ని తట్టుకోలేక
ఓటమి భారాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదు. ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ మోసాలకు పాల్పడలేదు. కేసీఆర్ నాయకత్వంపై భరోసా, సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు. కష్టపడి చేస్తున్నందనే ప్రభుత్వానికిత తెలంగాణ ప్రజలు అండగా నిలిచారు అని ఎంపీ కవిత అన్నారు.
టీఆర్ఎస్ వైపే ప్రజలు
తెలంగాణ అభివృద్ధిని గమనిస్తున్న ప్రజలు ఎప్పటికీ మావైపే ఉంటారన్న నమ్మకం మొదటి నుంచి ఉంది. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేశాం. తెలంగాణ ప్రభుత్వ పనితీరును చూసే ఓటర్లు మమ్మల్ని మరోసారి ఎన్నుకున్నారని భావిస్తున్నాం.
మరింత బాధ్యత పెంచింది
తెలంగాణలో టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్న ఫలితాలతో మా బాధ్యత పెంచింది. మాపై, మా పాలనపై ఇతర పార్టీలు ఎలాంటి ఫిర్యాదులు చేయడం రాజకీయపరమైన ఆరోపణలే అని కవిత వెల్లడించారు.
జోరుగా కారు స్పీడ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. కడపటి వార్తలు అందేసరికి టీఆర్ఎస్ 86, ప్రజాకూటమి 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార కేసీఆర్ ప్రభుత్వం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. కవిత ప్రచారం చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ 20 వేలకుపైగా మెజార్టీతో సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై గెలుపొందారు.