తెలంగాణను మరిచిన వెంకయ్య: ఎంపీ కవిత తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్రమంత్రి, బిజెపి వెంకయ్య నాయుడు పైన బుధవారం నాడు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వర్షాల కారణంగా వరద ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేయడంపై ఆమె మండిపడ్డారు.
వర్షాల ఎఫెక్ట్: కేసీఆర్కు పోటీగా 'వైయస్సార్', హైదరాబాద్కు మాత్రం దూరంవర్షాల వల్ల నీట మునిగిన ప్రాంతాలను వెంకయ్య ఏరియల్ సర్వే ద్వారా ఏపీలో పరిశీలించారు. దీనిపై ఆమె స్పందించారు. ఏపీలో విహంగ వీక్షణం చేసిన వెంకయ్య తెలంగాణను మాత్రం మర్చిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ఆమె తెలంగాణ భవన్లో బతుమ్మల పాటల యాప్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ నెల 30 నుంచి బతుకమ్మ సంబురాలను ప్రారంభిస్తామన్నారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 1,100 చోట్ల బతుకమ్మ వేడుకలు జరుపుతున్నట్లు ప్రకటించారు.
వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకుందామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తమ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. చరిత్రలోనే ఈసారి భారీ వర్షాలు పడ్డాయన్నారు.
మిడ్ మానేరుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలను కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. 1992లో మిడ్ మానేరును నిర్మించాలని ప్రతిపాదిస్తే 2006లో తొలిసారిగా టెండర్లు పిలిచారన్నారు.
2006 నుంచి రెండేళ్ల క్రితం వరకు ఎవరు అధికారంలో ఉన్నారని, గత ఎనిమిదేళ్లలో జరగని పనులు ఈ రెండేళ్లలో జరుగుతున్నాయని, వర్షాలు పడినప్పుడు నష్టం జరుగుతుందని, ఇలాంటి సమయాల్లో పార్టీలకు అతీతంగా ప్రజలకు సాయం అందించాల్సింది పోయి, రాజకీయం సరికాదన్నారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.