ఈటల ఎపిసోడ్లో రేవంత్ బిగ్ బాంబ్.. అక్కడ కేటీఆర్కూ భూములు..సీబీఐ విచారణకు డిమాండ్,కేంద్రానికి ఫిర్యాదు.!!
తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణల వ్యవహారంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరో బాంబు పేల్చారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని దేవరయాంజల్లో ఈటల,ఆయన బంధువులు వందల ఎకరాలు కబ్జా చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై రేవంత్ స్పందించారు. దేవరయాంజల్లో సీతారామస్వామి దేవాలయానికి చెందిన 1531 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని... ఇందులో మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ మౌత్ పీస్గా ఉండే పత్రికలో కేటీఆర్ పేరును తప్పించి మిగతావాళ్ల పేర్లను మాత్రం ప్రచురించారని పేర్కొన్నారు. కేసీఆర్కు నిజంగా చిత్తశుద్ది,నిజాయితీ ఉంటే... కేటీఆర్ను కూడా మంత్రివర్గం నుంచి తప్పించి ఈ భూముల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Recommended Video

అక్కడ కేటీఆర్కు,మల్లారెడ్డికి భూములు : రేవంత్
దేవరయాంజల్ గ్రామం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలోకి వస్తుందని రేవంత్ అన్నారు. ఈ నేపథ్యంలో అక్కడి భూముల వ్యవహారంపై తాను కొంత స్టడీ చేసినట్లు చెప్పారు. ఇందులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయని అన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్,ఆయన బంధువులు,బినామీలతో పాటు అక్కడ ఇద్దరు మంత్రులకు కూడా భూములు ఉన్నాయన్నారు. ఆ మంత్రులు కేటీఆర్,మల్లారెడ్డి అని చెప్పారు. కేటీఆర్ పేరిట ఉన్న సేల్ డీడ్ను బయటపెట్టారు. మంత్రి మల్లారెడ్డి సర్వే నంబర్ 658లో ఏడెకరాల భూమి ఉందని.. అందులో విలాసవంతమైన ఫాంహౌస్ను నిర్మించుకున్నారని చెప్పారు. అక్కడినుంచే ఆయన భూదందాలు,సెటిల్మెంట్లు నడుస్తున్నాయని చెప్పారు.

ఆ పత్రిక యాజమాన్యానికి కూడా... : రేవంత్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి మౌత్ పీస్గా ఉండే పత్రిక ప్రింటింగ్ కార్యకలాపాలు కూడా అక్కడినుంచే జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ పత్రి సీఎండీ దామోదర్ రావుకు అక్కడ 2.8ఎకరాల భూమి ఉందన్నారు. ఈ లెక్కన ఆ పత్రిక యాజమాన్యంలో భాగస్వామిగా ఉన్న కేసీఆర్ కూడా సహముద్దాయి కిందకు వస్తారని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 438లో కేటీఆర్కు దగ్గరివాడైన సురభి భూమ్రావుకు కూడా భూమి ఉందన్నారు. కంటోన్మెంట్ బోర్డు వైస్ ఛైర్మన్ పడ్నాల వీరారెడ్డి,తూంకుంట వైఎస్ ఛైర్మన్ శ్రీ నితిన్ రెడ్డి తదితరులకు అక్కడ భూములు ఉన్నట్లు ఆరోపించారు.

దేవరయాంజల్ భూముల చరిత్ర...
దేవరయాంజల్లోని 1531 ఎకరాల భూమిని 1925లో అప్పటి నిజాం నవాబు ఆ గ్రామస్తుడైన ఓ ఆసామీకి ఇచ్చాడని రేవంత్ చెప్పారు. ఆయన తదనంతరం అది సీతారాస్వామి ఆలయానికి వెళ్లిందన్నారు. అప్పటినుంచి కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసి చాలామంది ఆ భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుని అనుభవిస్తున్నారని ఆరోపించారు.గోడౌన్లు,ఇతరత్రా నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నారని చెప్పారు. ఆ భూములపై బ్యాంకుల్లో వందల కోట్ల రూపాయలు రుణాలు కూడా తెచ్చుకున్నారని ఆరోపించారు. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో మొత్తం మూడు ఉల్లంఘణలు జరిగాయన్నారు. ఒకటి ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం,రెండు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టడం,మూడు బ్యాంకుల ద్వారా రుణాలు పొందడం అని చెప్పారు.

సీబీఐ విచారణకు డిమాండ్...
తాను సత్యహరిశ్చంద్రుడినని,చంఢశాసనుడినని చెప్పుకునే కేసీఆర్ ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సూటిగా సవాల్ విసురుతున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతికి పాల్పడితే తన సొంత కొడుకునైనా,బిడ్డనైనా వదిలిపెట్టనని గతంలో అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ పేర్కొన్నారని గుర్తుచేశారు. కాబట్టి సీబీఐ విచారణకు ఆదేశించి కేసీఆర్ తన చిత్తశుద్ది,నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను పదేపదే జైలుకు పంపిస్తానని చెప్పే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి తానే స్వయంగా ఫిర్యాదు చేస్తానని... బీజేపీ నేతలకు చిత్తశుద్ది ఉంటే దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేయట్లేదన్నది నిజమే అయితే ఈ చర్యకు ఉపక్రమించాలన్నారు. ఇక దేవరయాంజల్లో త్వరలోనే ప్రజా సంఘాలు,తెలంగాణ ఉద్యమ సంఘాలు,మేదావులు,ఉద్యమకారులతో కలిసి నిజ నిర్దారణకు వెళ్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications