పార్టీలో గుంటనక్కలు, చీడపురుగులు; మరోమారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి షాకింగ్ కామెంట్స్
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
మొన్నటికి మొన్న ఆయన కుమార్తె ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేస్తే ప్రతిపక్షాల నాయకులు తన కుమార్తెను తన పై కేసు నమోదు చేసేలా కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక తాజాగా సొంత పార్టీ నేతల పైన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనగామలో తనకు టికెట్ రాకుండా చేయడం కోసం కొందరు కుట్ర పన్నుతున్నారని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు.

తాను స్థానికేతరుడనని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాను బ్రతికున్నంత వరకు తాను ఉండేది జనగామ గడ్డమీదనేనని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. తన కట్టె కాలేది జనగామ గడ్డ మీదనే అని పేర్కొన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తాను మరణించిన తర్వాత తన చితాభస్మాన్ని జనగామ నియోజకవర్గం లోని ప్రతీ చెరువులోనూ కలపాలని కార్యకర్తలను కోరారు.
పార్టీలో అక్కడక్కడా గుంటనక్కలు, చీడపురుగులు, కొండముచ్చులు ఉన్నారంటూ సొంత పార్టీ నేతలను టార్గెట్ చేశారు. ఇక అటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తామని కెసిఆర్ చెప్పారని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందు నీచ రాజకీయాలు సాగవని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు.
తన పనితీరు బాగుందని సీఎం కేసీఆర్ చెప్పారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెప్పుకొచ్చారు. 2014, 2018లో కూడా తనకు టికెట్ రాకుండా కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. మళ్ళీ జనగామ నుండి పోటీ చేసేది తానేనని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. ప్రజల మధ్య తిరిగి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసం పని చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి .












Click it and Unblock the Notifications