ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్: నేరుగా ప్రియాంక గాంధీ వద్దకు: ఎల్లుండి కీలక భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలన్నీప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికను ఎదుర్కొనాల్సి వస్తోన్న ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలవడానికి అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే రూపొందించుకుంటోన్నాయి. దీనితో మునుగోడు హాట్ హాట్గా మారింది.
అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం..
ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హోరాహోరిగా పోరు మొదలు పెట్టాయి. నాగార్జున సాగర్ మినహాయిస్తే- ఇదివరకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోయిన ప్రతిష్ఠను తిరిగిపొందడానికి మునుగోడు ఉప ఎన్నిక సరైన వేదికగా భావిస్తోంది టీఆర్ఎస్. అందుకే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. మునుగోడులో ప్రజా దీవెన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్లను ఏకి పారేశారు.
అమిత్ షా సభ..
బీజేపీ వంతు వచ్చింది. ఇవ్వాళ మునుగోడులో సమరభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించబోతోన్నారు కమలనాథులు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ సభకు హాజరు కానున్నారు. ఆయన చేతుల మీదుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువాను కప్పుకోనున్నారు. కోమటిరెడ్డితో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
కాంగ్రెస్ కసరత్తు..
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్కే ఈ సీటు ప్రిస్టేజియస్గా మారింది. ఈ స్థానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలోనే ఉందీ నియోజకవర్గం. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడాయన రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది. దీన్ని చేజార్చుకోకూడదని భావిస్తోంది. ఆ దిశగా ఢిల్లీ స్థాయిలో కసరత్తు మొదలు పెట్టింది.
ఎల్లుండి కీలక భేటీ..
మునుగోడు ఉప ఎన్నిక స్థితిగతులపై చర్చించడానికి మంగళవారం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గైర్హాజర్ కావొచ్చు. సోమవారం నుంచి ఆయన పాదయాత్ర చేపట్టనున్నందున ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేవు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ హాజరవుతారు.
ప్రియాంకతో సభ
ఈ సమావేశం ముగిసిన అనంతరం వారంతా ప్రియాంక గాంధీ వాద్రాను కలుస్తారు. సారాంశాన్ని వివరిస్తారు. మునుగోడులో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణాలతో పాటు- చర్చల వివరాలను ఆమెకు అందజేస్తారు. కేసీఆర్, అమిత్ షా బహిరంగ సభలను ఆమె దృష్టికి తీసుకెళ్తారు. ప్రజా దీవెన, సమరభేరి సభలకు వచ్చిన స్పందనను వివరిస్తారు. దీనికి ధీటుగా ప్రియాంక గాంధీతో బహిరంగ సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారని సమాచారం.