మునుగోడులో ఆ రెండు గంటల ఓట్లే సీన్ మార్చిందా - గెలిచేదెవరు..!!
మునుగోడు ఫలితం పైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. రేపు మునుగోడు ఓట్ల లెక్కింపు జరగనుంది. కానీ, పోలింగ్ ముగిసిన సమయం నుంచి గెలుపు ఎవరనేది లెక్కలు మొదలయ్యాయి. సర్వే సంస్థలు తమ నివేదికలను బయట పెట్టాయి. పలు సంస్థలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సంస్థలు బీజేపీకి సైలెంట్ ఓటింగ్ జరిగిందని..అది కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందంటూ విశ్లేషణలు చేసాయి. కానీ, ఇప్పుడు కొత్త లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆ రెండు గంటల పోలింగ్ తో
మునుగోడులో రికార్డు స్థాయిలో 93.41 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 91.30 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికలో సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ శాతం పోలింగ్ జరగటంతో ఓటరు నాడి పట్టుకోవటం అంత సులువు కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలంగ్ ఒక విధంగా ఉంటే..ఆ తరువాత రాత్రి 8 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో 9 గంటల వరకు జరిగిన పోలింగ్ కీలకంగా భావిస్తున్నారు. ఆ చివరి రెండు - మూడు గంటల పోలింగ్ పైనే ఇప్పుడు మునుగోడు గెలుపు ఆధారపడి ఉందనేది స్పష్టమవుతోంది.

పైకి ధీమా..లోలోపల గుబులు
సాయంత్రం 5 గంటల నుంచి మనుగోడులో పోలింగ్ ముగిసే సమయానికి 37, 665 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో యువత..మహిళలు చేరుకున్నారు. వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఆ చివరి సమయంలో జరిగిన పోలింగ్ పైన పార్టీలు భారీ అంచనాలతో ఉన్నాయి. బీజేపీ - టీఆర్ఎస్ పార్టీలు ఈ ఓటింగ్ పైన ధీమాగా ఉన్నాయి. మొత్తం నియోజకవర్గంలో 2,41,805 ఓట్లు ఉండగా, అందులో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ రోజు కొన్ని గ్రామాల్లో ఓటర్లు అనేక కారణాలతో ఓటింగ్ కు రాకుండా భీష్మించుకున్నారు. వారిని ప్రధాన పార్టీల నేతలు ఒప్పించి పోలింగ్ కు తీసుకొచ్చారు.
ఉప ఎన్నికలో ఈ స్థాయి పోలింగ్ తో
పోలింగ్ బూత్ ల వారీగా ఓటింగ్ సరళి పైన పార్టీలు విశ్లేషణలు చేస్తున్నాయి. తమకు ఎక్కడా ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు వేస్తున్నాయి. ఈ స్థాయిలో ఉప ఎన్నికలోనూ పోలింగ్ జరిగిందంటే అదే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ అనుకూల ఓటుగా టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు తమదే గెలుపు అని ధీమాగా చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు ఎగ్జిట్ పోల్స్ కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని..తమ విజయం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో..అటు మునుగోడు బెట్టింగ్ పెద్ద ఎత్తున సాగుతోందనే వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications