నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక - షెడ్యూల్ విడుదల..!!
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో భాగంగా మునుగోడు కు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 7న మునుగోడు బై పోల్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 15న నామినేషన్ల ను పరిశీలిస్తారు. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.
నవంబర్ 3న ఎన్నిక...నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే మునుగోడులో ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో పాటుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి స్రవంతి రెడ్డి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నారు. టీఆర్ఎస్ అధికారికంగా తమ అభ్యర్దిని ప్రకటించలేదు. కానీ, ఎన్నికల ప్రచారం మాత్రం కొనసాగిస్తోది. ఈ రోజు లేదా రేపు టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
దీని పైన సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉండటంతో ప్రధాన పార్టీలు ఇక్కడ ఎన్నిక పైన ఇక ఫోకస్ చేయనున్నారు. ఈ వారంలోనే మునుగోడు బై పోల్ కు సంబంధించి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తూ వచ్చాయి. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. టీపీసీసీ నేతలు తొలి విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసారు. ఇప్పుడు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో..రాజకీయంగా మునుగోడు కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.