మునుగోడు ఉపఎన్నిక: ఈసీకి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిర్యాదు, డబ్బు, మద్యం!
హైదరాబాద్: మునుగోడులో ఉపఎన్నిక ఓటింగ్ కొనసాగుతున్న క్రమంలో జరిగిన పరిణామాలపై ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. ఒక పార్టీపై మరో పార్టీ ఇలా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్లు ఫిర్యాదు చేసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు నిబందనలు ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్తో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ మద్యం, నగదు పంపిణీ చేస్తోందని ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్, జనగామ, చండూరు, తుమ్మలపల్లిలో పంపిణీ జరుగుతున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిన్నటి నుంచి ధర్నాలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సీఈవో వికార్ రాజ్కు ఫోన్ చేసి.. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా ఈసీని ఆశ్రయించారు. తన ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఈవో వికాస్ రాజ్.. మార్ఫింగ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కాగా, ఇప్పటి వరకు ఎన్నిక సంఘానికి 28 ఫిర్యాదులు అందాయి.
ఉపఎన్నికలు జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలోని పలు చోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. టీఆర్ఎస్ నేతలు డబ్బులు, మద్యం పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. సిద్దిపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులకు బీజేపీ నేతలు అప్పగించారు. పలు చోట్ల నగదును పట్టుకున్న బీజేపీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఇతర నియోజకవర్గాలవారిని పోలీసులకు అప్పగిస్తే.. పోలీసులు వారిని వదిలేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.
మరోవైపు, గురువారం సాయంత్రం 5 గంటల వరకు మునుగోడులో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఇంకా పలువురులో క్యూలైన్లలో ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.