మునుగోడు ఉపఎన్నిక: ఫలితాలు మరికొద్ది గంటల్లో, ఉత్కంఠ, తొలి ఫలితం 9కే
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల ఫలితాలపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే సెమీ ఫైనల్గా రాజకీయ నేతలు భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికను ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మాకంగా తీసుకుని విస్తృతంగా ప్రచారం చేశాయి. 3న జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఆదివారం మునుగోడు ఉపఎన్నిక ఫలితం రానుంది. కొద్ది గంటల్లోనే ఫలితాలు వస్తుండటంతో రాజకీయ పార్టీల నేతలు, ప్రజల్లోనూ ఆసక్తి పెరిగిపోతోంది. ఈవీఎంలను నల్గొండలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోదాంలో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొదట పరిశీలకులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఉదయం ఏడున్నర గంటలకు స్ట్రాంగ్ రూంను తెరిచి.. నమోదైన 686 పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. వీటి లెక్కింపు తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను.. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. కాగా మొదటగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూర్, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు.
మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడి కానుంది. ఒంటి గంట వరకు చివరి రౌండ్ ఫలితం తేలుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారుతుందని అంచనావేస్తున్నారు. కాగా, రాజకీయ పార్టీల నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ఆసక్తికగా ఉన్నారు.