నా టార్గెట్ కేసీఆరే, దానిని హరీష్ భరించలేరు: రేవంత్ సంచలనం
హైదరాబాద్: తనది మొదటి నుండు దూకుడుతత్వమని, తన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును పదవి నుండి దించడమేనని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
తనకు ఎర్రబెల్లి దయాకర రావుకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తాము పార్టీ ఫిరాయింపులను ఆపలేకపోయామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి రాజకీయ విలువలులేని నాయకుల మాటలను తాను పట్టించుకోనని చెప్పారు.
కేటీఆర్ ఆధిపత్యాన్ని భరించేందుకు హరీష్ రావు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ఉద్యమానికి సంబంధం లేని దొంగలు వచ్చి పదవులు అనుభవిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ ముసుగులో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్నారు.

మహానాడు నేపథ్యంలో తమ ఫ్లెక్సీలు ఉండవద్దనేది అతని ఉద్దేశ్యమన్నారు. తెరాసలో తనకు పదవి ఇవ్వలేదని, అందుకే బయటకు వచ్చానని చెప్పారు. కుల రాజకీయ ప్రభావం ఉన్నప్పుడు కులాన్ని విస్మరించలేమని చెప్పారు. తెలంగాణలో రెడ్డి - వెలమలకు పొసగదన్నారు.
టీడీపీలో తనకు అవసరమైనవన్నీ చంద్రబాబు కల్పిస్తారన్నారు. తాను ప్రింటింగ్ ప్రెస్ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. కేసీఆర్ను కుర్చీ నుండి దించడమే తన లక్ష్యమన్నారు. అందుకోసమే పని చేస్తానన్నారు. తనకు అధికారంతో కూడిన సేవ చేయడం ఇష్టమన్నారు.
విషయం పట్ల అవగాహన, పరిశీలన నాయకుడు అన్నవాడికి అవసరమని చెప్పారు. మేం ఎంత ప్రయత్నించినా ఫిరాయింపులు ఆపలేకపోయామన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ఉద్యమానికి సంబంధం లేని దొంగలు వచ్చారన్నారు.
తమ మహానాడు వస్తోంది కాబట్టి తెలంగాణలో ప్లెక్సీలు ఉండవద్దని, తీసి వేయాలనే రూల్ వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో లేదని, అలాంటప్పుడు పార్టీలో ఆధిపత్య పోరు ఎక్కడిదన్నారు. ఎర్రబెల్లితో తనకు విభేదాల్లేవని చెప్పారు.
తాను ఎంపీని కావాలనుకున్నానని చెప్పారు. కానీ, పార్టీలో పదవి కోసం పోటీ ఉన్నప్పుడు అందరికీ రాదని, కాబట్టి తనకు రాలేదని, తాను తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం నడుచుకన్నానని చెప్పారు. తనకు తెలంగాణతో పాటు పదవి కావాలని తెరాసలో ఉన్నప్పుడే చెప్పానని అన్నారు.
తనకు పదవి ఇచ్చి ఉంటే తెరాసలోనే ఉండేవాడినని అన్నారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట అబద్దమని తాను నిరూపిస్తానన్నారు. లేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. నాకు టీడీపీలో సమస్య రానేరాదని చెప్పారు.
ఏ హోదా లేకుంటే సేవ చేయగలనని చాలామంది చెప్పగలరని, అలాంటి వారు కూడా ఉన్నారని, కానీ చాలా తక్కువమంది ఉంటారని, అలాంటి వారిని తాను ఇప్పటి వరకు కలవలేదని చెప్పారు. ఇప్పుడు తెరాస నాయకులదంతా బీటీ బ్యాచే అన్నారు.
తన టార్గెట్ కేసీఆర్ను పదవి నుండి తప్పించడమే అన్నారు. తనకు రాజకీయ హోదాతో పాటు గౌరవం కావాలని, సేవ చేస్తానని చెప్పారు. తాను సంఘం (ఆరెస్సెస్) నుండి వచ్చానని, అందుకే తాను రాజ్ నాథ్ సింగ్ వంటి వారి కనిపించగానే వినయంగా ఉంటానని, కొందరి కాళ్లకు నమస్కరిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications