కేటీఆర్ ఆ వ్యాఖ్యల వెనక మర్మం.. మతలబు ఏంటో..!!
హైదరాబాద్: రాష్ట్రం ముందస్తు ఎన్నికల అంశంతో రగిలి పోతుంటే తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయ వ్యాఖ్యలు కాకుండా గుండెలు బరువెక్కే మాటలు మాట్లాడుతున్నారు. త్యాగం, సహనం, ధీమా, గెలుపోటములు అంటూ సెంటిమెంట్ ను పండింస్తున్నారు. ముందస్తు ఎన్నికల అంశాన్ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిన కేటీఆర్ తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంపూర్ణ మద్దత్తు గా ఆయన వాఖ్యలు చేస్తున్నారు. అదికారాన్ని త్యాగం చేస్తున్నామని చెప్తున్న కేటీఆర్ అసలు ఎందుకు, ఎప్పుడు త్యాగం చేస్తారో కూడా విశదీకరిస్తే బాగుండేది. తెలంగాణకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉందని చెప్తున్న గులాబీ దళం ముందస్తు హైరానా ఎందుకనే ఒకే ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు.
త్యాగం చేసి మళ్లీ వెనక్కి తీసుకోవచ్చా..? ఇదెక్కడి పద్దతి..!
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని త్యాగం చేసి ముందస్తుకు వెళ్తుంటే..ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్న పార్టీలు సంతోషించాలి కదా..! అని తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఒకింత విచిత్రంగానే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారం త్యాగం చేయమని ఎవరూ అడగలేదు. చేతిలో ఉన్న అధికారాన్ని త్యాగం చేయటం ఎందుకు?. మళ్ళీ అడగటం ఎందుకు?. సమయం అంతా అయిపోయిన తర్వాతే అడగొచ్చు కదా..! అసలు త్యాగం చేయాల్సిన ఆవశ్యకత గాని, పదవిని ఒదులుకోవాల్సిన గత్యంతరం గాని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో కూడా కేటీఆర్ వివరించాలని చర్చ జరుగుతోంది.
ముందస్తు హైరానా ఎందుకు..? అంత కుతికెల మీదికి ఏం అచ్చింది.?.
అంతే కాకుండా చేతిలో ఉన్న ఎనిమిది నెలల అధికారాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. పార్టీ నాయకుల్లో ప్రచారం జరుగుతున్నట్లుగా 2018 లోపు ఎన్నికలు పూర్తయితేనే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్పింది నిజమా?. లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే అప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత మరింత పెరిగి తిరిగి అధికారంలోకి రావటం కష్టమనే అభిప్రాయం పార్టీ అధినేతలో ఉందా?. అంతిమ నిర్ణేతలు అయిన ప్రజలేమీ తమకు ముందస్తు ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేయటం లేదు కదా? అసలు క్షత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ముందస్తు ఎన్నికల హడావిడి వెనక మతలబు ఏంటో బహిర్గతం చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.
ప్రజలతో ముడిపడ్డ ఎన్నికలు..! ప్రజల మనోభావాలతో పని లేదా..?
పరిపాలనా పరంగా..రాజకీయ పరంగా అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో ఎలాంటి ‘రహస్య ఏజెండా' లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది?. ఓ వైపు దేశంలో ఎవరూ చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలు..అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకుంటూ అధికార పార్టీ ఎందుకు అంత హైరానా పడుతుంది?. ఓ వైపు జమిలి ఎన్నికలకు జై కొట్టి రాష్ట్ర ప్రజలపై ఓ సారి అసెంబ్లీకి, మరో సారి పార్లమెంట్ ఎన్నికలు ప్రజల నెత్తిన రుద్దాల్సిన అవసరం ఏముంది?. ఏపీ, తెలంగాణకు షెడ్యూల్ ప్రకారం అయితే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు కలిసే వస్తాయి కదా..!!
అంతా అనుకూలం అనుకున్నప్పుడు అనుమానం ఎందుకు..?
రెండుసార్లు ఎన్నికలు నిర్వహించటం వల్ల అదనపు వ్యయం సంగతేంటి?. అంతుబట్టని రాజకీయ ప్రయోజనాలు, రహస్య ఏజెండా లేకపోతే ప్రభుత్వం ఎందుకు ముందస్తు ఎన్నికలకు వెళుతున్నదీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? అధికారం మా చేతిలో ఉంది కాబట్టి మా ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటామని, ప్రజలు దీన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెబుతారా?. ఓట్లు వేయాల్సిన ప్రజలకు సహేతుకమైన కారణాలు ఉంటే చెప్పటంలో తప్పేం ఉంటుంది?. ఇవన్నీ ప్రస్తుతానికి జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఐనా తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తోందని, గత ప్రభుత్వాలు చేయని అభివ్రుద్ది కేవలం నాలుగేళ్లలో గులాబీ పార్టీ చేసి చూపించిందని, ప్రజలంతా తమవైపే ఉన్నారని భరోసా వ్యక్తం చేస్తున్న గులాబీ పార్ట పడుతున్న హైరానా వెనక మర్మమేంటో కూడా చెప్పాలని తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తోంది.