కిమ్స్ వైద్యుడి మృతిపై వీడని మిస్టరీ: మద్యంలో విషం కలిపారా?
హైదరాబాద్: కిమ్స్ ఆస్పత్రి ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ రాఘవేందర్రావు మృతి మిస్టరీగా మారింది. హర్షవర్ధన్ కాలనీలో కారులో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆయన చనిపోవడానికి ముందు మద్యం తాగారని పోస్టుమార్టంలో తేలిందని బోయిన్ పల్లి పోలీసులు తెలిపారు.
అయితే ఆ మద్యంలో ఏదైనా విషపదార్ధం కలిసిందా అనే విషయాన్ని నిర్ధరించుకోవడానికి శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ కేసుకు సంబందించిన దర్యాప్తును ముమ్మరం చేశారు. బుధవారం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించిన పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి నుంచి ఆసుపత్రికని బయలుదేరిన ఆయన హర్షవర్ధన్ కాలనీలో బంధువులు గాని, క్లినిక్లు లేకపోయినప్పటికీ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. జీడిమెట్ల కాంటన్పార్కు గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో ప్లాట్ నెం. 6 లో ఉండే రాఘవేందర్రావు(60)కు భార్య స్వర్ణలత, కుమార్తె సుదీప, కుమారుడు శ్రీధర్ సంతానం.
పిల్లలు అమెరికాలో స్థిరపడగా భార్యాభర్తలు మాత్రం కాంటన్ పార్కులోని తమ విల్లాలో ఉంటున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో ఈఎన్టీ విభాగంలో పనిచేస్తున్న రాఘవేందర్రావు రోజూ మాదిరిగానే మంగళవారం ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి ఆస్పత్రికి బయలు దేరారు. మధ్యాహ్నం 1.30కి భార్య స్వర్ణలత ఫోన్ చేయగా నేను బిజీగా ఉన్నా తర్వాత ఫోన్ చేస్తానంటూ ఫోన్ కట్ చేశాడు.
అనంతరం 3 గంటలకు మరోసారి స్వర్ణతల ఫోన్ చేయగా రాఘవేందర్రావు నుంచి ఎలాంటి స్పందనలేదు. ఆమె గంటల తరబడి ఫోన్ చేస్తూనే ఉంది. ఫోన్ రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె బంధువులకు, అమెరికాలో ఉన్న కుమార్తె, కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం తెలిపారు.
అమెరికాలో ఉంటున్న కుమారుడు శ్రీధర్, కుమార్తె సుదీప గురువారం రాత్రి నగరానికి చేరుకున్నారు. శుక్రవారం అల్వాల్లో రాఘవేంద్రరావు అంత్యక్రియలకు ఏర్పాటు చేశామని బంధువులు తెలిపారు. కాగా, గాంధీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కిమ్స్ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు.
ఇంజనీరింగ్ చేసిన శ్రీధర్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూనే లఘచిత్రాలు తీస్తుండగా, బీఫార్మసీ చేసిన సుదీప ఉద్యోగం చేస్తోంది. మంగళవారం రాత్రి 10 గంటలకు స్వర్ణలత స్థానికంగా ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్కు బంధువులతో కలిసి వెళ్లారు. తన భర్త కనిపించడంలేదని ఆమె చెప్పగా.. రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పడంతో పోలీసుల నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.