పీవీ సింధుకు రూ.6 లక్షల వజ్రాభరణంతో సత్కారం, థ్యాంక్స్ చెప్పింది
చెన్నై: రియో ఒలింపిక్స్లో రజతం గెలిచిన పీవీ సింధును తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎన్ఏసీ జ్యువెల్లరీ సంస్థ వజ్రాభరణంతో సత్కరించింది. స్థానిక టీ నగర్లోని తమ షోరూంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఈ సత్కారం చేశారు.
ఎన్ఏసీ చైర్మన్ నాదెళ్ల ఆంజనేయులు చెట్టి, ఎండీ అనంత పద్మనాభన్ పాల్గొన్నారు. సింధుకు రూ.6 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ను బహూకరించారు.
ఈ సందర్భంగా అనంత పద్మనాభమన్ మాట్లాడుతూ... దేశం గర్వించదగ్గ బిడ్డను ఇచ్చిన సింధు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. తమ సంస్థ సింధుతో పాటు ఒలింపిక్స్లో పతకం సాధించిన సాక్షి మాలిక్, అద్భుత ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్కు కూడా నగదు బహుమతి ఇస్తోందన్నారు.
సింధుకు వజ్ర సత్కారం బహుమతి అందిస్తోందన్నారు. ఒలింపిక్స్లో వారు సాధించిన పతకాలకు గుర్తుగా తమ సంస్థ ఒలింపిక్ కలెక్షన్ పేరుతో బ్యాడ్మింటన్ రాకెట్, జిమ్నాస్టిక్ తదితరాల ఆకారంలో బంగారు ఆభరణాలను తయారు చేసిందన్నారు.
పీవీ సింధు మాట్లాడుతూ.. తాను పలుమార్లు చెన్నై వచ్చానని, తన తల్లిది ఇదే నగరమన్నారు. ఒలింపిక్స్ పోటీలలో తనను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ఏసీ కలెక్షన్లు అద్భుతంగా ఉంటాయని, తనను గౌరవించిన నిర్వాహకులకు ధన్యవాదాలు అన్నారు.