ఏడాది తర్వాత బీజేపీ కార్యాలయానికి నాగం: త్వరలో 'బచావో తెలంగాణ'
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వచ్చారు. సుమారు ఏడాది తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన పలువురు నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడైనా మీడియా సమావేశాలు పెట్టినా, పార్టీ కార్యాలయంలో కాకుండా ఇతరత్రా చోట పెట్టుకుంటా వచ్చారు. అయితే ఈరోజు కొత్తగా ఆయన బీజేపీ కార్యాలయంలో కనిపించడంతో కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
చాలా రోజుల తర్వాత నాగం బీజేపీ కార్యాలయానికి రావడానికి గల కారణం టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును తీవ్రతరం చేసేందుకేనని అంటున్నారు. ఇందు కోసం ఆయన 'బచావో తెలంగాణ' పేరిట కొత్త సంస్ధను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటులో కీలకపాత్ర పోషించి, ప్రస్తుతం కనుమరుగైన పలువురిని ఈ సంస్ధంలో చేర్చుకోనున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ సంస్థలో కీలక పాత్ర పోషించనున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఇందులో చేర్చుకోనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పోషించిన పాత్రను తెలంగాణ వచ్చిన తర్వాత తామ పోషిస్తామని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యెన్నం తెలిపారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత హైదరాబాదులోని బషీర్ బాగ్ ప్రాంతంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన దూకుడుని ప్రదర్శించేందుకే నాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.