పవన్! ‘పవరే’ కానీ, అలా ఐతే జనసేన ఎందుకు?: నాగేశ్వర్ సంచలనం
హైదరాబాద్: జనసేన పార్టీపై మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ సంచలన వ్యాఖ్యలపై చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ పొలిటికల్ లాబీయింగ్లో ఉన్నారని అన్నారు.
ఏదైనా సమస్యను గుర్తించి, చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి.. ఆయన ద్వారా పరిష్కారం చేయిస్తున్నారని నాగేశ్వర్ అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అప్పుడే జనసేన బాగుపడుతుంది
కాగా, లాబీయింగ్ అనే పదాన్ని నాగేశ్వర్ ఉపయోగించడంపై చర్చలో పాల్గొన్న పవన్ అభిమాని ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన నాగేశ్వర్ స్పందిస్తూ.. ‘పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే.. జనసేన బాగుపడుతుంది' అని అన్నారు.
ఇలా ఐతే పవన్కే నష్టం
‘పవన్ కళ్యాణ్పై దోమ వాలినా అణుబాంబు వేసి చంపుతాను, ఈగ వాలితే దానిపై రివాల్వర్ పేలుస్తాను' అనే పవన్ అభిమానుల లక్షణం వల్ల పవన్ కళ్యాణ్కే నష్టం తప్ప, తనకేం కాదని, తన కొంప మునిగేదేమీ లేదని అన్నారు. ఈ దోరణి మంచిది కాదని చెప్పారు. లాబీయింగ్ అనేది చెడ్డ పదమేమీ కాదని, అమెరికాలో అయితే లాబీయిస్టులు అనే ప్రత్యేక ప్రొఫెషన్ ఒకటి ఉంటుందని నాగేశ్వర్ అన్నారు.
పవన్లో శక్తి సామార్థ్యాలున్నాయి..
వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన బలమేంటో తనకే అర్థం కావట్లేదని చెబుతున్నారని, ఇంకా ఆయన బలం గురించి తానేమి చెబుతానని, అది కష్టమైన విషయమని సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఏపీలో పవన్ పోటీ చేస్తాడని, ఆయనకు కొన్ని శక్తిసామర్థ్యాలతో పాటు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పారు. అంతేగాక, సమాజంలో మార్పు తీసుకురావాలనే బలమైన ఆకాంక్ష పవన్లో ఉందని అన్నారు.
అలా ఐతే జనసేన ఎందుకు?
కానీ, పూర్తి స్థాయి రాజకీయాలు నడిపే పద్ధతి వేరేగా ఉంటుందని, సంబంధిత అంశాలపై పోరాటం చేయడం, ప్రజలను సమీకరించడం వంటివి ఉంటాయని అన్నారు. రాజకీయపార్టీలు లాబీయింగ్ ద్వారా కాకుండా రాజకీయాల వల్లే అభివృద్ధి చెందుతాయని, లాబీయింగ్ అనేది స్వచ్ఛంద సంస్థలు లేదా రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులు చేసే పని అని అన్నారు. సమస్యలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకే అయితే, రాజకీయ పార్టీని పవన్ స్థాపించాల్సిన అవసరమే లేదని వ్యాఖ్యానించారు.
సొంతంగానైనా సీఎంల వద్దకు వెళ్లొచ్చు..
అపారమైన జనాదరణ పొందిన నటుడు పవన్ కళ్యాణ్కు సొంతంగా ఏ రాజకీయపార్టీ లేకున్నా కూడా ముఖ్యమంత్రుల వద్దకు వెళ్లొచ్చని, ఆయా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లొచ్చని నాగేశ్వర్ అన్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ కార్యాచరణ ఉండాలనేది తన అభిప్రాయమని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని తన ప్రజా యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.